ఘోరం.. మద్యం సీసాతో కొట్టి స్నేహితుడి దారుణ హత్య
ABN , Publish Date - May 18 , 2026 | 01:38 PM
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే..
సికింద్రాబాద్, మే 18: మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణం తీసే వరకు వెళ్లింది. తనతో పాటే కూర్చొని మద్యం సేవించిన స్నేహితుడినే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్లోని ఎన్.టి.పి.సి (NTPC) భవనంలోని ఐదవ అంతస్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న రాత్రి నర్సింహులు అనే వ్యక్తి, అతని స్నేహితుడు కలిసి అక్కడే మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఒక విషయంలో తీవ్రమైన గొడవ మొదలైంది.
మద్యం మత్తులో ఉన్న స్నేహితుడు అక్కడే ఉన్న మద్యం సీసాతో నర్సింహులుపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తలకు బలంగా గాయం కావడంతో నర్సింహులు ఘటనా స్థలంలోనే రక్తపు మడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మోండా మార్కెట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
స్టాక్ మార్కెట్లో ట్రంప్ కలకలం .. 90 రోజుల్లో 3,700 లావాదేవీలు
జనగామలో కన్యాశుల్కాన్ని తలపించే ఘటన