పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు
ABN , Publish Date - Aug 27 , 2026 | 07:03 PM
హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన కారు పల్టీలు కొట్టి నీళ్లు లేని బావిలో పడటంతో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
హనుమకొండ, ఆగస్టు 27: జిల్లాలోని భీమదేవరపల్లి మండలం మంగళపల్లి గ్రామ శివారులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న నీళ్లు లేని బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏలూరి రాధమ్మ (70) కారు టైర్ల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం తీవ్రతకు కారు బావిలో పడటంతో స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
కారులో ఉన్న రవీందర్ రెడ్డి, వీరారెడ్డి, కిరణ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తాళ్ల సహాయంతో బావిలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. అనంతరం 108 అంబులెన్స్లో వారిని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంతో బొమ్మకల్ గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్
Read Latest Telangana News And Telugu News