జమీందార్ల లెక్క
ABN , Publish Date - May 30 , 2026 | 03:55 AM
కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందార్లు లెక్క వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారియర్ల లెక్క పని చేశారని గుర్తు .....
కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి
పార్టీని, ప్రభుత్వాన్ని వదిలి సొంత ప్రచారంతో సరి.. చేద్దామనుకున్న కార్యకర్తలనూ చేయనివ్వడం లేదు
పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి చురకలు.. పార్టీ నేతలంతా ఎస్ఐఆర్కు సిద్ధంగా ఉండాలి
మంత్రులూ డ్యూటీలు వేసుకుని పనిచేయాలి.. నాకూ ఒక నియోజకవర్గం కేటాయించండి
ఈ నెల రోజులూ పార్టీకేసమయం కేటాయించాలి.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ
ఎస్ఐఆర్ పైన అందరూ అవగాహన పెంచుకోవడం, ఈ కార్యక్రమం వల్ల సామాన్యులు, పేదలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామం. ఎస్ఐఆర్ ఆదివాసీలు, లంబాడాలు, వలస కార్మికులకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. దళితులు, మైనారిటీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉంది.
- సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): కొంత మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందార్లు లెక్క వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారియర్ల లెక్క పని చేశారని గుర్తు చేశారు. ఇప్పుడా కార్యకర్తలను ఎమ్మెల్యేలు కొందరు తమ వ్యక్తిగత ప్రచారానికే పరిమితం చేస్తున్నారని తప్పుబట్టారు. ఎమ్మెల్యే కూర్చుంటే, నిలబడితే, టెంకాయ కొడితే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికే కార్యకర్తలను పరిమితం చేస్తున్నారని చెప్పారు. వారిని ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేయనివ్వడం లేదని కుండబద్దలు కొట్టారు. రాహుల్గాంధీ, టీపీసీసీ చీఫ్, సీఎం ఇచ్చిన సందేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలను ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని, ఆయా ఎమ్మెల్యేల వ్యక్తిగత కార్యక్రమాలను ప్రచారం చేస్తున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తనకు సమాచారం ఉందని తెలిపారు. సహజంగా ఎమ్మెల్యేలతోనే కార్యకర్తలకు పనులు ఉంటాయి కాబట్టి.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి వారు ఆసక్తి చూపట్లేదన్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఈ తీరు మార్చుకోవాలని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు సోషల్ మీడియాలో కార్యకర్తలతో విస్తృతంగా ప్రచారం చేయించాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలకు సోషల్ మీడియాను ఎలా వినియోగించుకోవాలో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గాంధీభవన్లో శుక్రవారం జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాలు(పీఏసీ), సలహా కమిటీల ఉమ్మడి సమావేశంలో పార్టీ సోషల్ మీడియా ఎన్నికల ముందు పని చేసినట్లుగా అధికారంలోకి వచ్చాక పనిచేయట్లేదంటూ పలువురు సభ్యులు ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. ఎన్నికల కమిషన్ జూన్ నెలలో తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యాచరణపైన చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్రెడ్డితో పాటుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, రెండు కమిటీల సభ్యులు పాల్గొన్నారు. తొలుత ఎస్ఐఆర్తో పాటుగా పలు అంశాలపైన సభ్యులంతా తమ అభిప్రాయాలు వినిపించారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ, ఎస్ఐఆర్ వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారంపైన సంపూర్ణ అవగాహనను ప్రజాప్రతినిధులు పెంచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గతంలో బూత్ ఎన్ రోలర్ల సాయంతో 90 రోజుల్లో 45 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేయించగలిగామని, ఎక్కువ సభ్యత్వం నమోదు చేయించిన వారికి రాహుల్గాంధీతో సన్మానం చేయించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించిన ఎన్రోలర్ల సేవలను ఎస్ఐఆర్ విషయంలోనూ తీసుకోవాలని సూచించారు.
డ్యూటీలు వేసుకుని పనిచేయాలి
డిజిటట్ మెంబర్ షిప్ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్చార్జిని నియమించి నిరంతరం పర్యవేక్షించామని, ఎస్ఐఆర్ పర్యవేక్షణకూ అదే తరహాలో 119 నియోజకవర్గాలు, 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించాలని టీపీసీసీ చీఫ్కు సూచన చేశారు. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాలకు అందుబాటులో ఉండాల్సిందేనన్నారు. వారు సరిగా పనిచేస్తే అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా తొలగించకుండా చూడొచ్చునని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు నియోజకవర్గాల వారీగా డ్యూటీలు వేసుకుని పని చేయాలని స్పష్టం చేశారు. వారానికి ఒకరోజు చొప్పున నెలలో నాలుగు రోజులు ప్రభుత్వ పనులకు సెలవు పెట్టి పార్టీ పనులపై వారు దృష్టి పెట్టాలని చెప్పారు. తనకూ ఒక నియోజకవర్గం కేటాయించాలని, తానూ నెలలో నాలుగు రోజులు పార్టీకి సమయం కేటాయిస్తానని అన్నారు. ఎస్ఐఆర్ పర్యవేక్షణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడి సలహాలు, సూచనలు తీసుకోవాలని నేతలను కోరారు. ఊర్ల నుంచి వలసలు పోయిన వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ పర్యవేక్షణలో పార్టీ నాయకులంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. నాయకులు క్షేత్రస్థాయికి వెళితేనే కార్యకర్తలు బూత్ స్థాయికి వెళతారని చెప్పారు. నామినేటెడ్ పోస్టులను దాదాపుగా భర్తీ చేశామని, మిగిలిన వాటినీ చేసేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
హైదరాబాద్లో సన్నద్దత పేలవంగా ఉంది
ఎస్ఐఆర్కు సంబంధించి హైదరాబాద్ జిల్లాలో నాయకుల సన్నద్దత చాలా పేలవంగా ఉందని సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల నాయకులతో ఒకేసారి సమావేశం పెడితే జరిగింది చూశామని, అలా కాకుండా 15 నియోజకవర్గాల్లోనూ ఈ అంశంపైసమావేశాలు పెట్టాలని ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు సూచన చేశారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. ఎస్ఐఆర్పైన మహిళా కాంగ్రెస్.. క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని సూచన చేశారు. మహే్షకుమార్గౌడ్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ పేరుతో బెంగాల్ను టార్గెట్ చేసిన బీజేపీ తర్వాత లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని అన్నారు. డీసీసీ అధ్యక్షులు స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని బీఎల్వోల జాబితాలను పంపాలని కోరారు. శనివారం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లకు టీపీసీసీ అధ్యక్షుడు మహే్షకుమార్గౌడ్ బాధ్యతలు కేటాయించనున్నారు.
కార్యకర్త హ్యాపీగా లేడు: పలువురు సభ్యుల స్పష్టీకరణ
పార్టీ కోసం పదేళ్లు కష్టపడి నష్టపోయిన అనేక మంది కార్యకర్తలు అంత హ్యాపీగా లేరంటూ ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ సలహాదారు వి.హన్మంతరావు, ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులు అభిప్రాయపడ్డారు. నష్టపోయిన కార్యకర్తలను ఆదుకోవాలని, త్వరితగతిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు. మొదటి నుంచీ కాంగ్రెస్లో ఉన్న నాయకులకు పదవుల భర్తీలో అన్యాయం జరుగుతోందని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని రేణుకాచౌదరి అన్నారు.