జోగిపేటలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.. భారీగా డీజిల్ చోరీ
ABN , Publish Date - May 13 , 2026 | 09:55 AM
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ‘చెడ్డీ గ్యాంగ్’ మరోసారి కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఈ ముఠా, మరోసారి హల్చల్ చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే..
జోగిపేట, మే 13: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో ‘చెడ్డీ గ్యాంగ్’ మరోసారి కలకలం సృష్టించింది. గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న ఈ ముఠా, మరోసారి హల్చల్ చేసి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. కాకపోతే ఈసారి ఇళ్లలోకి చొరబడకుండా, నిలిపి ఉంచిన వాహనాలే లక్ష్యంగా ఈ ముఠా డీజిల్ చోరీలకు పాల్పడటం గమనార్హం. కారులో వచ్చిన దుండగులు, పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన బస్సుల నుంచి సుమారు 50 లీటర్ల డీజిల్ను దొంగిలించారు. అనంతరం మరో ప్రాంతంలో నిలిపి ఉంచిన లారీ ట్యాంక్ నుంచి 100 లీటర్ల డీజిల్ను దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు. మంగళవారం ఉదయం వాహనాల్లో ఇంధనం లేకపోవడాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం, లారీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో చెడ్డీ గ్యాంగ్ కారులో వచ్చి డీజిల్ దొంగిలిస్తున్న దృశ్యాలు కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. అయితే, దొంగతనానికి వాడిన కారు వివరాలను సేకరించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆ కారుకు ఉన్న నంబర్ ప్లేట్ అసలైనది కాదని, అది ఒక ఆటోకు చెందిన నంబర్ అని దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా, నిందితులు వాడిన కారు కూడా ఎక్కడో దొంగిలించినదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి సమయాల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్-బెళగావి మధ్య ఆరు కొత్త రైళ్లు
‘నీట్’ రద్దు దురదృష్టకరం: దామోదర
For More TG News And Telugu News