చాదర్ఘాట్లో అసభ్య ఘటన.. మైనర్ నిందితుడికి నెల రోజుల సామాజిక సేవ శిక్ష
ABN , Publish Date - Jul 23 , 2026 | 09:20 PM
చాదర్ఘాట్ వంతెనపై ఆటోలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో జువైనల్ జస్టిస్ బోర్డు కీలక తీర్పు వెలువరించింది. మైనర్ నిందితుడికి నెల రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.
హైదరాబాద్, జులై 23: చాదర్ఘాట్ వంతెనపై ఆటోలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైరల్ ఘటనలో జువైనల్ జస్టిస్ బోర్డు కీలక తీర్పు వెలువరించింది. మైనర్ నిందితుడికి నెల రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. గత ఏడాది చర్చనీయాంశమైన చాదర్ఘాట్ బ్రిడ్జి ఆటో ఘటనలో జువైనల్ జస్టిస్ బోర్డు (JJB) కీలక తీర్పు వెలువరించింది. కదులుతున్న ఆటోలో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడైన మైనర్కు నెల రోజుల పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. ఈ కేసు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాల ప్రకారం, నిందితుడు నెల రోజుల పాటు రోజూ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 వరకు జువైనల్ జస్టిస్ బోర్డు కార్యాలయంలో సామాజిక సేవ చేయాల్సి ఉంటుంది. ఈ శిక్ష ద్వారా బాలుడిలో బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందించడమే లక్ష్యంగా బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటన గత ఏడాది నవంబర్ 7వ తేదీ రాత్రి చాదర్ఘాట్ వంతెనపై వెళ్తున్న TG05T4061 నంబర్ ఆటోలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో 'X' (ట్విట్టర్)లో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా పెట్రోల్ కార్ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో చాదర్ఘాట్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితుడు మైనర్ అని తేలడంతో అతడిని నాంపల్లి జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం సామాజిక సేవ శిక్షను ఖరారు చేసిన బోర్డు, తదుపరి న్యాయపరమైన చర్యల కోసం కేసు ఫైల్ను 5వ VACJM కోర్టుకు సమర్పించినట్లు చాదర్ఘాట్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. ఈ తీర్పు బాల నేరస్థుల పునరావాసం, బాధ్యతాయుతమైన ప్రవర్తనకు ప్రాధాన్యం ఇచ్చే జువైనల్ న్యాయ వ్యవస్థ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి
ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే
For More AP News And Telugu News