AP News: నేలమ్మకు రంగులకళ తెచ్చానని.. చుక్కా నవ్వవే!
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:31 AM
‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై సన్ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్వాసి అగరబత్తీ) ఫైనల్స్ సోమవారం అమీర్పేట మునిసిపల్ మైదానంలో..
హైదరాబాద్ సిటీ, జనవరి 12(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు (పవర్డ్ బై సన్ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్టనర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్టనర్ పరిమళ్ మందిర్ వారి భారత్వాసి అగరబత్తీ) ఫైనల్స్ సోమవారం అమీర్పేట మునిసిపల్ మైదానంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి గెలిచిన 33 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన నటకిరీటి రాజేంద్రప్రసాద్, ‘శతమానం భవతి’ సినిమా దర్శకుడు సతీశ్ వేగేశ్న, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జి.సృజన ప్రాంగణంలో కలియదిరిగి ముగ్గుల చుక్కల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రంగవల్లుల్లోని సందేశాత్మక వ్యాఖ్యానాలకు ముగ్ధులయ్యారు. పోటీల్లో ఖమ్మం జిల్లా మహిళ ఎల్. విజయకుమారి ప్రఽథమ స్థానంలో నిలిచారు. ఆమెకు రాజేంద్ర ప్రసాద్, తన చేతుల మీదగా రూ.30వేల చెక్కు అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన జె.అశ్విని( ఆదిలాబాద్), వి.దివ్య (నల్లగొండ), బి. విజయలక్ష్మి (మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా), శిల్పారెడ్డి (మహబూబ్నగర్)కి తలా రూ. పదివేల చెక్కును బహూకరించారు. మిగతా 28మంది పోటీదారులకు కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పోటీదారులు పరిచిన 33ముగ్గులను చూస్తుంటే తనకు తెలంగాణలోని ప్రతి జిల్లాను చుట్టొచ్చినంత సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్’ వారు తమను పుట్టింటికి వచ్చిన ఆడబిడ్డలా చూసుకుంటున్నారని ఓ మహిళ తనతో చెప్పారని, అది ఈ సంస్థల నిబద్ధతకు నిదర్శనమని ఉద్ఘాటించారు. ‘శతమానం భవతి’ సినిమా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ముత్యాల ముగ్గులను చూస్తుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ఈ ముత్యాల ముగ్గుల పోటీలతో సంక్రాంతి ముందే వచ్చినంత సంబురంగా ఉందని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ జి.సృజన పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వక్కలంక రమణ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి - ఏబీఎన్ 16ఏళ్లుగా ముత్యాల ముగ్గుల పోటీని దక్షిణాది స్థాయిలో నిర్వహిస్తోందని చెప్పారు. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని మొత్తం 81కేంద్రాల్లో ముగ్గుల పోటీ నిర్వహించినట్లు వెల్లడించారు. హిందూపురంలో 600మంది పోటీదారులు పాల్గొనడం ‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్’ ముత్యాల ముగ్గులపోటీకి వస్తున్న అమితాదరణకు నిదర్శనమన్నారు. ఈ ఏడాది తెలంగాణలోని ప్రతిజిల్లా నుంచి ఫైనల్స్కు విజేతలను ఆహ్వానించినట్లు వివరించారు. ముగ్గుల పోటీకి బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల మాజీ ప్రిన్సిపాల్ పి. రజని, ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణురాలు పారిజాత న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. పరిమళ్ భారత్ అగరబత్తీ తెలంగాణ, ఏపీ ఏరియా సేల్స్ మేనేజర్ ఇ. సతీశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తదితరులు హాజరయ్యారు.

Also Read:
Telangana: మాట వినకపోతే ఉద్యోగాలు పోతాయ్!
Telagnana: రేప్ కేసులో నన్ను ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించారు
Bheemavaram: కిక్కిరిసిన భీమవరం!