Bheemavaram: కిక్కిరిసిన భీమవరం!
ABN , Publish Date - Jan 13 , 2026 | 07:23 AM
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్నవారి వాహనాలతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి.
పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ఇక్కట్లు
ఉమ్మడి పశ్చిమకు సంక్రాంతి కళ
భీమవరం క్రైం/పెదపాడు/ఏలూరు క్రైం, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పండుగ సందడి స్పష్టంగా కనిపిస్తోంది. దూర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వస్తున్నవారి వాహనాలతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి. ప్రధానంగా భీమవరం పట్టణంలో ఎటు చూసినా వాహనాల రద్దీ కనిపిస్తోంది. పొరుగు రాష్ర్టాలో ఉండే స్థానికులతోపాటు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి కేవలం పండగ కోసం వస్తున్న వాహనాలతో పట్టణం కిక్కిరిసింది. ఇవికాకుండా పండుగ నేపథ్యంలో చుట్టు ప్రాంతాల నుంచి షాపింగ్లకు వచ్చేవారి వాహనాలు అదనం. ప్రధానంగా తెలుగు రాష్ర్టాల్లో పండగ అంటే ముందుగా గుర్తొచ్చేది భీమవరమే!. కోడిపందాలు, సంక్రాంతి సంబరాలకు ఏటా ఇతర రాష్ర్టాల నుంచి వేలాది మంది వస్తుంటారు. ఈ ఏడాదికూడా ముందుగానే హోటళ్లు బుక్ చేసుకున్నవారు వాహనాలతో తరలివస్తుండడంతో పట్టణమంతా సందడి నెలకొంది.