మరో ఐదేళ్లల్లో భారతీయ ఐటీ, బీపీఓ సేవలు కనుమరుగు: బిలియనీర్ వినోద్ ఖోస్లా
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:04 PM
వచ్చే ఐదేళ్లల్లో భారత ఐటీ, బీపీఓ రంగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని టెక్ ఆంత్రప్రెన్యూర్ వినోద్ ఖోస్లా అన్నారు. ఉద్యోగాల లభ్యతపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: పలు రంగాల్లో మనుషుల స్థానాన్ని ఏఐ భర్తీ చేస్తుందని ఇప్పటికే అనేక మంది టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టెక్ బిలియనీర్, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా (Vinod Khosla) కూడా వచ్చి చేరారు. భారతీయ ఐటీ, బీపీఓ సేవల సంస్థలకు ఆయన తాజాగా కీలక హెచ్చరిక చేశారు. వచ్చే ఐదేళ్లల్లో ఐటీ, బీపీఓ రంగాలు దాదాపుగా కనుమరుగయ్యే అవకాశం ఉందని అన్నారు. ఏఐ కారణంగా ఇవి కనుమరుగు అవ్వొచ్చని అన్నారు.
అనేక రంగాల్లో ఏఐ మనుషుల కంటే మెరుగ్గా పనిచేసే స్థితికి త్వరలో చేరుకుంటుందని ఆయన అన్నారు. సంప్రదాయక ఔట్సోర్సింగ్ వ్యాపార విధానం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని అన్నారు. ఐటీ, బీపీఓ రంగాలు దాదాపుగా కనుమరుగు అవుతాయని హెచ్చరించారు. మెజారిటీ మనుషుల కంటే ఏఐ మెరుగ్గా పనిచేస్తుందని చెప్పారు.
అకౌంటింగ్, మెడిసిన్, చిప్ డిజైన్, ఆర్కిటెక్చర్, సేల్స్ ఇలా అనేక రంగాల్లో ఏఐ ఏజెంట్స్ తమ సత్తా చాటుతాయని ఖోస్లా తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీయ యువత ఏఐ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి సారించాలని అన్నారు. ఏఐ మెరుగ్గా ఉండే రంగాల్లో జాబ్స్ కోసం ప్రయత్నించడం వృధా అని చెప్పారు.
అమెరికా, చైనాలపై ఆధారపడే అవసరం లేకుండా స్వతంత్ర ఏఐ మోడల్స్ భారత్కు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. 2030-35 మధ్య కాలంలో విద్య, వైద్యం, న్యాయసేవలు వంటివన్నీ దాదాపు ఉచితంగానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఆర్థికపరంగా చూస్తే ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని అంచనా వేశారు.
ఇవీ చదవండి:
డిగ్రీ పట్టా లేకున్నా మా సంస్థలో జాబ్ ఇస్తాం.. జోహో ఫౌండర్ శ్రీధర్ వెంబు ఆఫర్
పెళ్లిలో వధూవరుల కుటుంబాల పరస్పర దాడులు! రసగుల్లాలు తక్కువయ్యాయని..