ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్ ఆనంద్
ABN , Publish Date - Jul 24 , 2026 | 03:04 PM
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్పై యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఆంక్షలు విధించడంతో ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఫిడే నిబంధనల ప్రకారం ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో సంబంధాలున్న పలువురు ప్రముఖులపై ఈయూ తాజాగా ఆంక్షలు ప్రకటించింది. ఇందులో రష్యా మాజీ ఉప ప్రధాని అర్కాడీ ద్వోర్కోవిచ్ పేరు కూడా ఉండటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. ద్వోర్కోవిచ్ 2018 నుంచి ఫిడే అధ్యక్షుడిగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆనంద్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ఫిడే అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్ తన బాధ్యతల నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. దీంతో ఫిడే చార్టర్ ప్రకారం నేను తాత్కాలిక అధ్యక్షుడి బాధ్యతలు స్వీకరించాను. ఫిడే స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్న ద్వోర్కోవిచ్కు ధన్యవాదాలు. ఫిడే కౌన్సిల్, పరిపాలనా బృందం, సభ్య దేశాల సమాఖ్యలతో కలిసి సంస్థ కార్యకలాపాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించేలా కృషి చేస్తాను. ద్వోర్కోవిచ్ బలమైన బృందాన్ని, స్పష్టమైన దిశను ఏర్పాటు చేశారు. ఆ ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు మన అందరి బాధ్యత’ అని ఆనంద్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
వరల్డ్ కప్ డ్రీమ్ టీమ్లో వొజిన్హా, హాలాండ్