Share News

టెస్టు క్రికెట్‌ రీఎంట్రీపై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!

ABN , Publish Date - Jun 22 , 2026 | 10:53 AM

భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా విరాట్ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై కోహ్లీ స్పందించాడు.

టెస్టు క్రికెట్‌ రీఎంట్రీపై విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇదే!
Virat Kohli

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా విరాట్ టెస్టుల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఈ విషయం గురించి విరాట్‌కు ప్రశ్న ఎదురైంది. కాగా అతడు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఢిల్లీలో కోహ్లీ తన సొంత బ్రాండ్ వన్8 స్పోర్ట్స్‌వేర్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా అతడికి టెస్టు క్రికెట్ రీఎంట్రీపై ప్రశ్న ఎదురైంది. ‘మీ టెస్టు పరుగుల సంఖ్య 9,230. ఇదే ధరతో మన బ్రాండ్‌లో షూ ఉంది. మరికొన్ని టెస్టులు ఆడి పరుగులు పెంచి ఆ షూ విలువ కూడా పెంచాలని అనుకుంటున్నారా?’ అని వ్యాఖ్యాత డానిష్ సైత్ ప్రశ్నించాడు. దీనికి సరదాగా స్పందిస్తూ.. ‘అమ్మకాలు తక్కువైనా పర్వాలేదు. టెస్టు క్రికెట్‌తో నా పని అయిపోయింది. అదంతా అప్పుడే ముగిసిపోయింది’ అని కోహ్లీ సమాధానమిచ్చాడు.


గతేడాది మేలో టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తన 14 ఏళ్ల టెస్టు క్రికెట్ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోర్ 254 నాటౌట్. భారత టెస్టు చరిత్రలో అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ల జాబితాలో కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు. 2016 నుంచి 2019 మధ్య కాలంలో కోహ్లీ టెస్టు క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఆ నాలుగేళ్లలో 43 టెస్టుల్లో 4,208 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను శాసించాడు. కెప్టెన్‌గా ఏడు డబుల్ సెంచరీలు నమోదు చేసి అరుదైన రికార్డు నెలకొల్పాడు.


నాకెంతో ప్రత్యేకం: విరాట్

వన్8 బ్రాండ్‌ను ప్రారంభించిన తర్వాత కోహ్లీ మాట్లాడాడు. ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘నా జీవితంలో అన్నీ ఢిల్లీలోనే ప్రారంభమయ్యాయి. ఇక్కడే పుట్టాను.. ఇక్కడే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాను. అందుకే ఢిల్లీలోనే వన్8 బ్రాండ్‌ను ప్రారంభించాలని అనుకున్నా. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైనది. అభిమానుల ప్రేమ, మద్దతు వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను’ అని విరాట్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

బౌలర్లకు ఫీల్డర్ల మద్దతు అవసరం: హర్మన్‌ప్రీత్ కౌర్

వింబుల్డన్: సింగిల్స్ విభాగంలో బరిలోకి సెరెనా విలియమ్స్

Updated Date - Jun 22 , 2026 | 11:59 AM