వింబుల్డన్: సింగిల్స్ విభాగంలో బరిలోకి సెరెనా విలియమ్స్
ABN , Publish Date - Jun 22 , 2026 | 07:35 AM
టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి వింబుల్డన్ కోర్టులో సందడి చేయనుంది. నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సెరెనా.. వింబుల్డన్ ఛాంపియన్షిప్ సింగిల్స్ విభాగంలో చోటు దక్కించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి వింబుల్డన్ కోర్టులో సందడి చేయనుంది. నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సెరెనా.. ఇప్పటికే డబుల్స్ విభాగంలో వీనస్ విలియమ్స్తో కలిసి బరిలోకి దిగనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా వింబుల్డన్ ఛాంపియన్షిప్ సింగిల్స్ విభాగంలో కూడా చోటు దక్కించుకుంది. వైల్డ్ కార్డ్ ద్వారా వింబుల్డన్ సింగిల్స్ మహిళల విభాగంలో సెరెనా టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టనుంది.
23 గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిళ్ల విజేత సెరెనా.. 2022 యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్కు దూరమైన సంగతి తెలిసిందే. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించకపోవడంతో ఆమె పునరాగమనంపై ఊహాగానాలు వినిపించేవి. తాజాగా వింబుల్డన్ నిర్వాహకులు ఆమెకు సింగిల్స్ వైల్డ్ కార్డ్ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. సింగిల్స్లో బరిలోకి దిగడానికి తన కుమార్తె ఒలింపియా ప్రధాన కారణమని సెరెనా వెల్లడించింది. ఒలింపియా ప్రోత్సాహం వల్లే తిరిగి టెన్నిస్ కోర్టులో అడుగుపెడుతున్నట్లు తెలిపింది.
1998లో వింబుల్డన్లో అరంగేట్రం చేసిన సెరెనా.. 2002, 2003, 2009, 2010, 2012, 2015, 2016 సంవత్సరాల్లో ఏకంగా ఏడు సింగిల్స్ టైటిళ్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అలాగే వీనస్తో కలిసి ఆరు డబుల్స్ టైటిళ్లు కూడా కైవసం చేసుకుంది. 44 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా మారిన తర్వాత తిరిగి గ్రాండ్స్లామ్ వేదికపై అడుగుపెడుతున్న సెరెనా.. టెన్నిస్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
ఇవి కూడా చదవండి:
ముక్కోణపు సిరీస్ విజేతగా భారత్-ఎ
33 మ్యాచుల్లో 100 గోల్స్ .. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా...