Share News

భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ అవుతాడేమో: ఈస్ట్ జోన్ సెలెక్టర్

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:25 PM

దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై వస్తోన్న విమర్శలకు ఆ జట్టు సెలెక్టర్ ప్రవంజన్ మల్లిక్ సమాధానమిచ్చారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ అవుతాడేమో: ఈస్ట్ జోన్ సెలెక్టర్
Vaibhav Sooryavanshi

ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టుకు భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై వస్తోన్న విమర్శలకు ఆ జట్టు సెలెక్టర్ ప్రవంజన్ మల్లిక్ సమాధానమిచ్చారు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వైభవ్ భవిష్యత్తులో కెప్టెన్ కూడా అవుతాడని అభిప్రాయపడ్డారు. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈస్ట్ జోన్ జట్టుకు వైభవ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే 15 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం సరైన నిర్ణయం కాదంటూ సోషల్ మీడియాలో పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


‘వైభవ్‌ను కెప్టెన్‌గా నియమించలేదు. వైస్ కెప్టెన్ మాత్రమే. కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్ కావడంతో రోజంతా మైదానంలో చురుకుగా ఉంటాడు. వైభవ్ మొత్తం మ్యాచ్‌కు నాయకత్వం వహించాల్సిన పరిస్థితి ఉండదు. చిన్న వయసులోనే బాధ్యతలు ఇవ్వడం అతడిని మరింత పరిణతి చెందిన ఆటగాడిగా తీర్చిదిద్దుతుంది. దేశం కోసం బాగా ఆడాలనే తపన వైభవ్‌లో ఉంది. యువ ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగించడం చాలా ముఖ్యం. అందుకే ఈ అవకాశాన్ని కల్పించాం. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్తులో కెప్టెన్ అవుతాడేమో! అతడి ప్రతిభ అసాధారణం. వైభవ్ ఇప్పటికే బిహార్ ఫస్ట్‌క్లాస్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంది. వాటిని మేము గౌరవిస్తాం. అయితే జట్టుకు ఏది మంచిదో అదే చేశాం. ఇది సెలక్షన్ కమిటీ సభ్యులందరూ కలిసి తీసుకున్న నిర్ణయం’ అని ప్రవంజన్ స్పష్టం చేశారు.


కాగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈస్ట్ జోన్ సెలక్షన్ కమిటీ సమావేశంలో ప్రవంజన్ మల్లిక్‌తో పాటు దిబ్యేందు చక్రవర్తి, మనీష్ వర్ధన్, అలోక్ సాహా, అనంత్ ప్రకాశ్ పాల్గొన్నారు. అయితే ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఈ దులీప్ ట్రోఫీ జరగనుంది. కాగా ఈస్ట్ జోన్ జట్టు తన తొలి మ్యాచ్‌ను నార్త్ జోన్‌తో ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

కామన్వెల్త్ గేమ్స్: ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తొచ్చాయి.. నీరజ్ చోప్రా భావోద్వేగం

కామన్వెల్త్ గేమ్స్: ఓడిపోయినా కాంస్యం.. దేశానికి తొలి పతకం అందించిన బాక్సర్ తరోనా

Updated Date - Aug 01 , 2026 | 01:44 PM