ఉబెర్ కప్ 2026: చైనాపై ఓటమి.. టోర్నీ నుంచి సింధు ఔట్
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:14 PM
ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్ 2026 నుంచి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు నిష్క్రమించింది. చైనాతో జరిగిన కీలక పోరులో స్టార్ షట్లర్ పీవీ సింధు పరాజయం పాలైంది. గ్రూప్ ఏలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో చైనాపై 5-0 తేడాతో భారత్ భారీ ఓటమిని చవి చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్ఠాత్మక ఉబెర్ కప్ 2026 నుంచి భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు నిష్క్రమించింది. చైనాతో జరిగిన కీలక పోరులో స్టార్ షట్లర్ పీవీ సింధు పరాజయం పాలైంది. గ్రూప్ ఏలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో చైనాపై 5-0 తేడాతో భారత్ భారీ ఓటమిని చవి చూసింది. మొదట అద్భుత ప్రదర్శనతో ఆధిపత్యం ప్రదర్శించిన సింధు.. చైనా ప్లేయర్ వాంగ్ జియితో జరిగిన హైవోల్టేజ్ పోరులో పోరాడినా ఫలితం లేకపోయింది.
నిర్ణయాత్మక సింగిల్స్ మ్యాచ్లో సింధు 16-21, 21-19, 19-21 తేడాతో వాంగ్ జియి చేతిలో ఓడిపోయింది. దీంతో భారత జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఆ తర్వాత తప్పక గెలవాల్సిన డబుల్స్ గేమ్లో చైనా భారత జోడీపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ప్రియ కొన్జెంగమ్- శ్రుతి మిశ్రా జోడీ చైనాపై ఓటమి పాలైంది. ఆ తర్వాత మరో డబుల్స్లో ట్రిసా జాలీ-కవిప్రియ సెల్వమ్ జోడి కూడా పరాజయం పాలవ్వడంతో భారత్ ఓటమి ఖరారైంది. ఈ నేపథ్యంలో రివర్స్ సింగిల్స్లో ఇషారాణి బరుహా తొలి గేమ్ను గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో ఓడింది. టోర్నీ ఆరంభంలో డెన్మార్క్తో ఓటమి, ఆపై ఉక్రెయిన్పై ఘన విజయం సాధించిన భారత్.. చైనాతో మాత్రం పూర్తిగా తడబడింది. ప్రతి అవకాశాన్ని చైనా జట్టు సమర్థంగా ఉపయోగించుకోవడంతో భారత జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. ఇక థామస్ కప్లో భాగంగా పురుషుల విభాగంలో భారత జట్టు బుధవారం చైనాతో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ