Share News

డిప్రెషన్‌లోకి వెళ్లా.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నా: శ్రేయాంక పాటిల్

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:56 PM

భారత మహిళల జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన దశ గురించి తాజాగా పంచుకుంది. గాయాల కారణంగా ఆమె చాలా కాలం పాటు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.

డిప్రెషన్‌లోకి వెళ్లా.. క్రికెట్‌ను వదిలేయాలనుకున్నా: శ్రేయాంక పాటిల్
Shreyanka Patil

ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన దశ గురించి తాజాగా పంచుకుంది. గాయాల కారణంగా ఆమె చాలా కాలం పాటు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. బొటన వేలు ఫ్రాక్చర్, మణికట్టు గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్ 2025, ఐపీఎల్ 2025లో చోటు కోల్పోయింది. ఆ సమయంలో డిప్రెషన్‌కు గురయ్యానని శ్రేయాంక వెల్లడించింది. ఆదివారం భారత్-పాక్ మ్యాచ్ అనంతరం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.


‘చాలాకాలం పాటు నన్ను గాయాలు తీవ్రంగా వేధించాయి. ఆ సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లాను. ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నాను. కానీ నా మనసులో ఒక స్వరం ఎప్పుడూ వినిపించేది. ‘నువ్వు ఈ ఆటను ప్రేమిస్తున్నావు.. ఆ ప్రేమ కోసమే ఇక్కడ ఉన్నావు.. నువ్వు కచ్చితంగా క్రికెట్ ఆడి తీరాలి’ అని ప్రతిక్షణం నా మనసు నాకు గుర్తు చేసేది. నేను ఇష్టపడే పనిని ఎలా వదిలేస్తాను? అందుకే ధైర్యంగా నిలబడ్డాను. నాన్న ఎప్పుడూ నాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా నన్ను ప్రోత్సహించారు. ఆ మద్దతే నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు మళ్లీ మైదానంలోకి రావడం చాలా ఆనందంగా ఉంది’ అని శ్రేయాంక పేర్కొంది.


బుమ్రా సలహాలు పని చేశాయి..

భారత స్టార్ పేసర్ బుమ్రా తనకు ఇచ్చిన సలహాలను కూడా శ్రేయాంక గుర్తు చేసుకుంది. గాయాల నుంచి కోలుకునే సమయంలో బుమ్రాతో అనేక విషయాలు చర్చించానని తెలిపింది. ‘ఒత్తిడిలో బౌలింగ్ ఎలా చేయాలి? యార్కర్లు ఎలా ప్రాక్టీస్ చేయాలి? వంటి ఎన్నో ప్రశ్నలు బుమ్రాను అడిగాను. ఆయన ఫాస్ట్ బౌలర్.. నేను స్పిన్నర్.. అయినప్పటికీ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే విషయంలో చాలా సూచనలు ఇచ్చారు. ‘క్రికెట్‌లో గాయాలు సహజం.. ప్రతి ప్లేయర్ ఇలాంటి దశను ఎదుర్కొంటాడు. నువ్వు చిన్న వయసులోనే ఈ అనుభవం పొందుతున్నావు. దానితో పోరాడకు.. దానిని అర్థం చేసుకో’ అని చెప్పారు. మొదట్లో రెండు మూడు నెలలు ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోనే ఉండిపోయాను. అది నా స్వభావం కాదు. నేను సాధారణంగా చాలా ఉత్సాహంగా ఉంటాను. కానీ గాయాలు నన్ను ఒంటరిదానిగా మార్చాయి. ఆ సమయంలోనే రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, అమన్‌జ్యోత్ కౌర్‌ నాకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత నేను ఒంటరిగా లేనని అర్థమైంది’ అని శ్రేయాంక వెల్లడించింది.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో హ్యాండ్‌షేక్ వివాదం: పాకిస్థాన్ కోచ్ రియాక్షన్ ఇదే

అవును.. మైదానంలో మాత్రం కోహ్లీ అహంకారే: రవి శాస్త్రి

Updated Date - Jun 15 , 2026 | 04:56 PM