సచిన్ నుంచి వైభవ్ వరకు.. 37 ఏళ్లలో ఎంత మార్పు!
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:32 AM
భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్తో రెండో టీ20లో భారత జట్టు క్యాప్ అందుకున్నాడు. టీమిండియా తరఫున అత్యంత పిన్న వయసులో డెబ్యూ చేసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. 15 సంవత్సరాల 99 రోజుల వయసులో భారత జెర్సీ ధరించిన వైభవ్.. దాదాపు 37 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది.
1989లో కరాచీలోని నేషనల్ స్టేడియంలో 16 ఏళ్ల 205 రోజుల వయసులో సచిన్ టెస్టు అరంగేట్రం చేశాడు. ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్, అబ్దుల్ ఖాదిర్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొనేందుకు సచిన్ సిద్ధమయ్యాడు. ఆ కాలంలో ప్రత్యక్ష ప్రసారాలే పరిమితంగా ఉండగా.. సచిన్ అరంగేట్రాన్ని చాలా మంది టెలివిజన్లో కూడా స్పష్టంగా చూడలేకపోయారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన అనంతరం సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్కు.. నిన్నటి వరకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. సోషల్ మీడియా, టీవీ ఇలా పలు వేదికల్లో వైభవ్ అరంగేట్రం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడేవారే. అతడికి అవకాశం ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్లు చేసినవారే. ఇంగ్లండ్తో రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం చేసిన క్షణం నుంచి ప్రతి కదలికను అత్యాధునిక 4కే కెమెరాలు బంధించాయి. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ వేదికల కారణంగా అతడికి సంబంధించిన ప్రతి విషయం క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
ఆట శైలిలోనూ తేడా..
ఆట శైలిలోనూ సచిన్, వైభవ్ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ముంబై క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందిన సచిన్.. డిఫెన్స్తో పాటు క్లాసిక్ షాట్లతో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. మరోవైపు టీ20 యుగంలో పెరిగిన వైభవ్.. తొలి నుంచే దూకుడే ఆయుధంగా బరిలోకి దిగాడు. డిఫెన్స్ కంటే భారీ షాట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే కొత్తతరం బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్ అరంగేట్రం చేసిన రోజుల్లో ప్రపంచం మరో దశలో ఉండేది. ఫ్లాపీ డిస్క్ల కాలంలో సచిన్ ప్రయాణం మొదలైతే.. కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.
ఆ ఒక్కటి మారలేదు..
ఈ 37 ఏళ్లలో ఒక్క విషయం మాత్రం మారలేదు. భారత క్రికెట్ అభిమానులు మరో యువ క్రికెటర్ కోసం ఎదురుచూడటం. ఒకప్పుడు సచిన్ చుట్టూ నెలకొన్న అంచనాలు.. ఇప్పుడు వైభవ్ చుట్టూ కనిపిస్తున్నాయి. సచిన్ కాలంలో అభిమానులు ఆట ముగిసిన తర్వాత ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూసేవారు. ఇప్పుడు వైభవ్ కనిపిస్తే చాలు.. సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో ప్రతి అభిమాని ఒక డిజిటల్ రిపోర్టర్గా మారిపోయాడు. సచిన్ భారత క్రికెట్కు కొత్త శకానికి నాంది పలికితే.. వైభవ్ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే కొత్త తరం ప్లేయర్గా నిలుస్తాడా? అన్నదే ఇప్పుడు అందరికి ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి:
అందరికీ రుణపడి ఉంటా.. అరంగేట్రం తర్వాత వైభవ్ ఎమోషనల్ పోస్ట్
ఫిఫా ప్రపంచ కప్లో వివాదం.. ఎంబాపెపై బంతిని విసిరిన పరాగ్వే ప్లేయర్