Share News

అథ్లెటిక్స్ కోచ్‌పై జీవితకాల నిషేధం విధించిన నాడా

ABN , Publish Date - Sep 16 , 2026 | 07:05 PM

భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం రేపుతోంది. నిషేధిత పదార్థాలను అందించిన కేసులో అథ్లెటిక్స్‌ కోచ్‌ రాకేశ్‌ కుమార్‌పై నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) జీవితకాల నిషేధం విధించింది.

అథ్లెటిక్స్ కోచ్‌పై జీవితకాల నిషేధం విధించిన నాడా
NADA

ఇంటర్నెట్ డెస్క్: భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ కలకలం రేపుతోంది. నిషేధిత పదార్థాలను అందించిన కేసులో అథ్లెటిక్స్‌ కోచ్‌ రాకేశ్‌ కుమార్‌పై నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ (NADA) జీవితకాల నిషేధం విధించింది. మరోవైపు నిషేధిత డ్రగ్స్‌ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పవర్‌లిఫ్టర్‌ గౌరవ్‌ వాత్స్‌ను కూడా తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. రాకేశ్‌ కుమార్‌పై గతేడాది మార్చిలోనే సస్పెన్షన్‌ విధించగా.. అప్పటి నుంచే అతడి జీవితకాల నిషేధం అమల్లోకి వచ్చినట్లు నాడా తాజాగా పేర్కొంది.


నేషనల్‌ ఇంటర్‌ స్టేట్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించిన స్ప్రింటర్‌ ప్రకృతి రూపా రావును కూడా నాడా తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. ఆమె డోప్‌ టెస్టులో నిషేధిత స్టెరాయిడ్లు వాడినట్లు తేలడంతో ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఖేలో ఇండియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన వెయిట్‌లిఫ్టర్‌ చెల్సీపై ఐదేళ్ల నిషేధం విధించారు. డోప్‌ పరీక్షలో విఫలమైనందుకు ఆమెపై ఈ శిక్ష పడింది. ఇక నిషేధిత ఆక్సాండ్రోలోన్‌ వాడినట్లు పరీక్షల్లో తేలడంతో ఓ మైనర్‌ వెయిట్‌లిఫ్టర్‌ను కూడా తాత్కాలికంగా సస్పెండ్‌ చేశారు.


ఏడుగురు అథ్లెట్లు సస్పెండ్‌

డోపింగ్‌ కేసుల్లో అథ్లెటిక్స్‌కు చెందిన ఏడుగురు పేర్లు తాజా తాత్కాలిక సస్పెన్షన్‌ జాబితాలో నమోదయ్యాయి. క్వార్టర్‌మైలర్‌ కౌశల్‌ కుమార్‌, స్టీపుల్‌చేజర్‌ జుఝార్‌ సింగ్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ బల్జీత్‌ కౌర్‌ తదితరులపై కూడా నాడా చర్యలు తీసుకుంది. దీంతో భారత అథ్లెటిక్స్‌లో డోపింగ్‌ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ 2027: భారత్‌లోనే మినీ వేలం.. వారణాసిలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు!

యూఎస్ ఓపెన్ ఫైనల్‌లో రాకెట్ బద్దలు.. సబలెంకాకు భారీ జరిమానా

Updated Date - Sep 16 , 2026 | 07:24 PM