ఐపీఎల్ కంటే దేశవాళీ క్రికెట్ ఆడటమే కష్టం: ఎల్ఎస్జీ యువ ప్లేయర్
ABN , Publish Date - May 23 , 2026 | 05:22 PM
లఖ్నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్ ముకుల్ చౌదరి ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే దేశవాళీ క్రికెట్ ఆడటమే కష్టమని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో లఖ్నవూ సూపర్ జెయింట్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన యువ ప్లేయర్ ముకుల్ చౌదరి అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. కేకేఆర్పై ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాడు. ఈ టోర్నీ నుంచి లఖ్నవూ జట్టు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ పార్టీ స్పాయిలర్గా మారిన ఎల్ఎస్జీ.. ఎలిమినేట్ అయ్యాక విజయాలు సాధిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముకుల్ చౌదరి ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే దేశవాళీ క్రికెట్ ఆడటమే కష్టమని వెల్లడించాడు.
‘ఐపీఎల్లో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లక్షలాది మంది మమ్మల్ని చూస్తుంటారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఇక్కడ పరిస్థితులు చాలా సులభంగా అనిపిస్తాయి. ప్రత్యర్థి బౌలర్ల బలాలు, వ్యూహాలు ముందే తెలుస్తాయి. వీడియో విశ్లేషణలు, డేటా అందుబాటులో ఉంటాయి. దేశవాళీ క్రికెట్లో ఇలాంటివేమీ ఉండవు. ఐపీఎల్లో కొత్తగా వచ్చిన ప్లేయర్కి కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే ప్రశాంతంగా ఉండి.. ఫ్లోలో వెళ్లిపోతే దాన్ని అధిగమించవచ్చు. ఈ సీజన్లో నాకు అవకాశం దక్కుతుందని అనుకోలేదు. కానీ వచ్చినా సిద్ధంగా ఉండాలని అనుకున్నా. తుది జట్టులోకి తీసుకున్నారని తెలిసినప్పుడు కాస్త టెన్షన్ అనిపించింది. మ్యాచ్ సమయంలో ప్రేక్షకుల హోరు, కెమెరాలు.. ఇవన్నీ నాకు కొత్తగా అనిపించాయి. కానీ మైదానంలోకి వెళ్లిన తర్వాత పెద్దగా తేడా అనిపించలేదు. సులువుగా ఆడేయొచ్చనే ధీమా వచ్చింది’ అని ముకుల్ చౌదరి వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: పంజాబ్ ప్లే ఆఫ్స్కు వెళ్లాలంటే.. సమీకరణాలు ఇలా!
షేక్హ్యాండ్ వివాదం.. కోహ్లీ అలా చేసి ఉండకూడదు: ఇర్ఫాన్ పఠాన్