Share News

పంత్ కెరీర్ ముగిసిపోయిందని భావించడం తప్పు: ఇర్ఫాన్ పఠాన్

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:34 PM

టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. పంత్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సెలక్టర్లకు సూచించాడు.

పంత్ కెరీర్ ముగిసిపోయిందని భావించడం తప్పు: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2026లోనూ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున పేలవ ప్రదర్శన చేశాడు. కెప్టెన్‌గా జట్టును అట్టడుగు స్థానంలో నిలిపాడు. దీంతో బీసీసీఐ ఇటీవల ప్రకటించిన వన్డే, టీ20 జట్టులో పంత్ చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. పంత్ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సెలక్టర్లకు సూచించాడు.


‘పంత్ వైట్ బాల్ జట్టులో మాత్రమే స్థానం కోల్పోయాడు. అతడి కెరీర్ ముగిసిపోయిందని భావించడం తప్పు. పంత్ తిరిగి భారత జట్టులోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిమిత ఓవర్లలో పంత్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయాడు. ఐపీఎల్‌లోనూ నిరాశపర్చడంతో సెలక్టర్లు అతడిని తప్పించారు. ప్రస్తుతం వన్డేల్లో వికెట్ కీపర్, బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ భారత జట్టు తొలి ఎంపిక. బ్యాకప్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. అతడు టాప్ ఆర్డర్‌లో ఆడగలడు. మూడో ఎంపిక సంజు శాంసన్ కావాలి. అతడికి అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకున్నాడు. కాబట్టే పంత్‌ను వన్డేల్లో తప్పించాల్సి వచ్చింది’ అని ఇర్ఫాన్ వెల్లడించాడు.


‘వన్డే ప్రపంచ కప్ 2027 సమీపిస్తోన్న నేపథ్యంలో సెలక్టర్లకు నేనిచ్చే సూచన ఒకటే.. పంత్‌ను పూర్తిగా విస్మరించొద్దు. ప్రస్తుతం అతడు కేవలం వైట్ బాల్ క్రికెట్‌లో వెనుకబడ్డాడు. ఇషాన్ కిషన్‌ను చూడండి.. జట్టులో చోటు కోల్పోయిన తర్వాత దేశవాళీ క్రికెట్‌లో రాణించి మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. జార్ఖండ్‌కు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. పంత్ కూడా అదే మార్గంలో ముందుకు సాగాలి. కష్టపడి మళ్లీ తన స్థానాన్ని సంపాదించుకోవాలి’ అని పఠాన్ పేర్కొన్నాడు.


ఐపీఎల్ 2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన పంత్.. 14 మ్యాచ్‌ల్లో కేవలం 312 పరుగులే చేయగలిగాడు. జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలవడంతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో 121 బంతుల్లో 81 పరుగులు చేసి తన క్లాస్‌ను మరోసారి నిరూపించాడు. ఈ ఇన్నింగ్స్‌తో అతడి ప్రతిభ ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశాడు. 2024 ఆగస్టులో చివరి సారిగా పంత్ వన్డే మ్యాచ్ ఆడాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.


ఇవి కూడా చదవండి:

ప్రైవేట్ జెట్‌లో క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్

వన్డే ప్రపంచ కప్ 2027: షెడ్యూల్ ఖరారు!

Updated Date - Jun 12 , 2026 | 05:34 PM