న్యూజిలాండ్ టూర్: టీమిండియాకు కొత్త చిక్కులు.. కీలక ప్లేయర్లకు విశ్రాంతి?
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:39 PM
వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు సిరీస్లు ఆడనుంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు సుదీర్ఘంగా సాగే ఈ టూర్కు ముందు టీమిండియాకు కొత్త సమస్య వచ్చి పడింది.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ 5 టీ20లు, 5 వన్డేలు, 2 టెస్టు సిరీస్లు ఆడనుంది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1 వరకు సుదీర్ఘంగా సాగే ఈ టూర్కు ముందు టీమిండియాకు కొత్త సమస్య వచ్చి పడింది. షెడ్యూల్ బిజీగా ఉండటంతో చివరి రెండు వన్డేలకు పలువురు కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వన్డే సిరీస్ ముగిసిన నాలుగు రోజులకే టెస్టు సిరీస్ ప్రారంభం కానుండటం టీమిండియా మేనేజ్మెంట్కు సవాలుగా మారనుంది.
శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు వన్డేతో పాటు టెస్టు జట్లలోనూ ఆడే అవకాశం ఉంది. దీంతో వారి పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని.. న్యూజిలాండ్తో చివరి రెండు వన్డేలకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా భావిస్తున్నట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ను సమర్థంగా నిర్వహించేందుకు భారత కోచింగ్ సిబ్బందిని కూడా రెండు బృందాలుగా విభజించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్, అసిస్టెంట్ కోచ్ సితాన్షు కోటక్, ఫీల్డింగ్ కోచ్ శుభదీప్ ఘోష్.. ఈ నలుగురిలో ఇద్దరు వన్డే జట్టుతో ఉండనున్నారు. మిగిలిన ఇద్దరు టెస్టు జట్టును పర్యవేక్షించే అవకాశం ఉంది.
డబ్ల్యూటీసీలోనూ కీలకమే..
రెండు టెస్టుల ఈ సిరీస్ ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) సైకిల్లోనూ కీలకం కానుంది. న్యూజిలాండ్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా.. భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్లో తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్చర్చ్లో రెండో టెస్టు జరగనుంది. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే ఈ సిరీస్ అత్యంత కీలకం కానుంది.
ఇవి కూడా చదవండి:
టీ20ల్లో ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్కు దూసుకెళ్లిన భారత్