తనపై వస్తున్న విమర్శలకు అదిరిపోయే రిప్లయ్ ఇచ్చిన జైస్వాల్
ABN , Publish Date - Aug 24 , 2026 | 01:43 PM
శ్రీలంక బౌలర్ అసిత ఫెర్నాండోతో జరిగిన వివాదం విషయంలో యశస్వి జైస్వాల్ పై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా బ్లోగే కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలకు జైస్వాల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. విషయం గురించి పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇచ్చేయడం సరికాదని మండిపడ్డాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మైదానంలో ప్రదర్శించే దూకుడుపై తాజాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు అసిత ఫెర్నాండోతో జైస్వాల్ వ్యవహరించిన తీరుపై కొందరు మాజీ ఆటగాళ్లు విమర్శించారు. భారత బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ సైతం జైస్వాల్ అంతగా ఫెర్నాండోకు దగ్గరగా వెళ్లి ఉండాల్సి కాదని అభిప్రాయపడ్డారు.
ఈ వివాదంపై ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్పందిస్తూ.. జైస్వాల్ అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడని, కాకపోతే ప్రత్యర్థుల మాటలకు రియాక్ట్ అవుతాడన్నారు. జైస్వాల్ ఇలాంటి చర్యలకు దిగకుండా తన ఆటపై దృష్టి పెట్టాలని ఓ వీడియోలో పేర్కొన్నారు. 'ప్రత్యర్థి ఆటగాడు రెచ్చగొట్టారు నిజమే, కానీ అతనూ(జైస్వాల్) కొంచెం హద్దు మీరి దగ్గరకు వెళ్లాడు' అని హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు.
ఈ వ్యాఖ్యలపై యశస్వి జైస్వాల్ ఇవాళ(సోమవారం) ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ మరోసారి ఘాటుగా బదులిచ్చాడు. హర్షా భోగ్లే పోస్ట్ చేసిన వీడియోపై స్పందిస్తూ.. ‘సదరు ఆటగాడు ఏమన్నాడో మీకు తెలియకుంటే.. ఇలాంటి తీర్పులు ఇవ్వడం ఆపండి. ఎవరైనా హద్దులు మీరి ప్రవర్తిస్తే.. భారత్ తిరిగి పోరాడుతుందని.. వాళ్లకు గట్టిగానే బదులు ఇస్తుందని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని జైస్వాల్ కామెంట్ సెక్షన్లో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. హర్షా భోగ్లేకు కౌంటర్ ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంకతో టెస్టులో రిషబ్ పంత్ అరుదైన ఘనత
ఓడినప్పటికీ చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బౌలర్