సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో టీమిండియా దిగ్గజం
ABN , Publish Date - Aug 30 , 2026 | 04:30 PM
ఒకప్పుడు తన వేగంతో ప్రపంచంలోని స్టార్ బ్యాటర్లను హడలెత్తించిన టీమిండియా మాజీ పేసర్.. ఇప్పుడు మాత్రం సామాన్య ప్రయాణికుడిలా మెట్రోలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
స్పోర్ట్స్ డెస్క్: కొందరు సెలబ్రిటీలు గుడికి, ఎన్నికల ఓటింగ్ సమయంలో క్యూ లైన్లలో, ఇతర జర్నీ సమయాల్లో చాలా సాధారణ వ్యక్తుల్లా సింపుల్గా ఉంటారు. తరచూ జనాల మధ్యలోకి వచ్చి.. వారిని సర్ప్రైజ్ చేస్తుంటారు. అలానే టీమిండియా దిగ్గజ క్రికెటర్ ఒకరు కూడా సామాన్య ప్రయాణికుడిలా మెట్రోలో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. సాధారణ ప్రయాణికుడిలా కనిపించిన ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. భారత క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జవగళ్ శ్రీనాథ్. ట్రాలీ బ్యాగ్తో బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న ఆయన ఫొటో నెట్టింట వైరల్గా మారింది.
బెంగళూరులోని ‘నమ్మ మెట్రో’లో జవగళ్ శ్రీనాథ్ సాధారణ ప్రయాణికుడిలా కనిపించారు. నీలం రంగు జీన్స్, లేత నీలం రంగు షర్ట్ ధరించిన ఆయన.. చేతిలో ట్రాలీ బ్యాగ్తో తన నిల్చున్నారు. మెట్రోలోనే ఉన్న ఓ క్రికెట్ అభిమాని శ్రీనాథ్ను గుర్తించి ఫొటో తీసుకున్నాడు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. సెలబ్రిటీ అయినప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ప్రజా రవాణాలో ప్రయాణించడంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
చాలా మంది అభిమానులు ఆ ఫొటోపై వెంటనే స్పందించి... తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. తాము శ్రీనాథ్ను బెంగళూరులో ఎప్పుడూ చూస్తుంటామని, ఆయన తన హోదాను ప్రదర్శించకుండా సామాన్యుడిలా తన పని తాను చేసుకుంటూ ఉంటాడని కొందరు తెలిపారు. ఇలాంటివి కర్ణాటక క్రికెటర్లలో సర్వసాధారణమని కొందరు వ్యాఖ్యానిస్తూ... రాహుల్ ద్రవిడ్, వెంకటేష్ ప్రసాద్ వంటి వారు పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎంతో నిరాడంబరంగా ఉంటారని వెల్లడించారు. జవగళ్ శ్రీనాథ్ భారత క్రికెట్లో సుదీర్ఘకాలం సేవలందించిన గొప్ప పేసర్లలో ఒకరు. 1992, 1996, 1999, 2003 వన్డే ప్రపంచకప్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
ఇవి కూడా చదవండి:
కెప్టెన్గా తొలి డీఆర్ఎస్ తీసుకున్న వైభవ్ సూర్యవంశీ..
ఛాంపియన్స్ ట్రోఫీ: శ్రీలంక ఆతిథ్య హక్కులు తొలగించిన ఐసీసీ