హర్మన్ప్రీత్ కెప్టెన్సీపై సెలెక్టర్లదే తుది నిర్ణయం: టీమిండియా హెడ్ కోచ్
ABN , Publish Date - Jun 29 , 2026 | 03:45 PM
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జర్నీ గ్రూప్ దశలోనే ముగిసింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో భారత్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో..
స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ప్రయాణం మరోసారి గ్రూప్ దశలోనే ముగిసింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో భారత్ ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ నిర్దేశించిన 170 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ బ్యాటర్లు ఎల్లీస్ పెర్రీ, యాష్లే గార్డనర్ అద్భుత శతక భాగస్వామ్యంతో ఛేదించి రికార్డు సృష్టించారు. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నప్పటికీ టీమిండియా ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్, మాజీ క్రీడాకారిణి అంజుమ్ చోప్రా ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు.
మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో కోచ్ ముజుందార్ మాట్లాడుతూ.. హర్మన్ప్రీత్ భారత జట్టు సారథిగా కొనసాగాలనేదే తన అభిమతమని స్పష్టం చేశాడు. అయితే, నాయకత్వ మార్పుపై తుది నిర్ణయం సెలెక్టర్లదేనని పేర్కొన్నాడు. హర్మన్ప్రీత్ కెప్టెన్గా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రశ్నించగా.. అవును, అయితే కెప్టెన్ను నిర్ణయించాల్సింది సెలెక్టర్లేనని ముజుందార్ బదులిచ్చాడు.
మరోవైపు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కూడా హర్మన్కే ఓటేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టును నడిపించడానికి ఆమె కంటే మెరుగైన ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డింది. డబ్ల్యూపీఎల్ (WPL)లో చూపించే దూకుడును అంతర్జాతీయ మ్యాచ్ల్లో మన టాప్ ఆర్డర్ ప్రదర్శించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. భయపడకుండా ఆడే భిన్నమైన విధానాన్ని అలవర్చుకోవాలని, కనీసం 180 పరుగులను లక్ష్యంగా పెట్టుకుని ఆడగలిగే బ్యాటర్లను గుర్తించడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని అంజుమ్ చోప్రా సూచించింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం సరైన నిర్ణయమే: అంబటి రాయుడు
రిటైర్మెంట్ గురించి నన్నెవరూ ఒత్తిడి చేయలేదు.. స్టోక్స్ క్లారిటీ