Share News

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా

ABN , Publish Date - May 07 , 2026 | 05:19 PM

భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి దేవజిత్‌ సైకియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా కీలక పదవికి రాజీనామా
Devajit Saikia Assam Advocate General

స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కార్యదర్శి దేవజిత్‌ సైకియా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అస్సాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో దాదాపు ఐదేళ్ల పాటు అడ్వకేట్ జనరల్‌గా సైకియా సేవలందించారు. రాజ్యాంగ సంప్రదాయాలను గౌరవిస్తూ అస్సాం రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు దేవజిత్ సైకియా తెలిపారు.


ఇటీవలే ప్రభుత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ.. తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్‌తో పాటు న్యాయరంగంలోనూ సైకియా పేరు సంపాదించారు. దేవాజిత్ సైకియా అస్సాంలోని గువహటిలో జన్మించారు. రాష్ట్రం తరపున వికెట్ కీపర్, మిడిల్-ఆర్డర్ బ్యాటర్‌గా రంజీ ట్రోఫీ ఆడాడు. అతను 1991లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి నాలుగు మ్యాచ్‌లు ఆడాడు.


అనంతరం న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టి గువహటి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2021లో అస్సారం రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అత్యంత పిన్న వయస్కుడి(52 ఏళ్ల)గా సైకియా రికార్డు క్రియేట్ చేశారు. అస్సాం క్రికెట్ అసోసియేషన్‌లో వివిధ హోదాల్లో పని చేసి.. 2022లో బీసీసీఐ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అనంతరం జై షా ఐసీసీ చైర్మన్‌గా వెళ్లడంతో బీసీసీఐ కార్యదర్శి బాధ్యతలు సైకియా చేపట్టారు.


ఇవి కూడా చదవండి:

విమానంలో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన చాహల్!

తీవ్రమైన డిప్రెషన్‌లో టీమిండియా మాజీ క్రికెటర్

Updated Date - May 07 , 2026 | 05:24 PM