ఆ విషయం నాకు సంతృప్తినిచ్చింది: అజింక్య రహానే
ABN , Publish Date - Apr 15 , 2026 | 10:42 AM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై 32 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. మ్యాచ్ అనంతరం కేకేఆర్ జట్టు కెప్టెన్ అజింక్య రహానే తమ జట్టు ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(మంగళవారం) చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 32 పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ సీజన్లో 5 మ్యాచ్ల్లో ఇది నాలుగో ఓటమి. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అత్యల్ప రన్రేట్తో ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. సీఎస్కే చేతిలో ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్, కాంబినేషన్, ఆటగాళ్ల ఫామ్ గురించి మాట్లాడాడు.
రహానే మాట్లాడుతూ.. 'జట్టు కూర్పు పరంగా, గత మ్యాచ్కు, ఈ మ్యాచ్కు మధ్య ఉన్న కూర్పు చాలా బాగుందని మేము భావించాం. 190 పరుగులకే వారిని కట్టడి చేయడం సంతృప్తినిచ్చింది. పవర్ప్లేలో 70 పరుగులు ఇచ్చినా, మా బౌలర్ల చక్కటి ప్రదర్శనతో కమ్బ్యాక్ ఇవ్వగలిగాం. కార్తిక్ త్యాగిని ప్రత్యేకంగా ప్రశంసించాలి. అతని పేస్ అద్భుతంగా ఉంది. ప్రతి మ్యాచ్తో మెరుగవుతున్నాడు' అని అన్నాడు
'మా ఇన్నింగ్స్ మధ్య దశలో స్పిన్నర్లను ఎదుర్కోవడం కష్టంగా అనిపించింది. సీఎస్కే స్పిన్నర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. మేము చివరికి వరకు ఆడి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ఫలితాలు రాకపోతే కాంబినేషన్ మార్చుకోవాల్సి వస్తుంది. కష్ట సమయాల్లో ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలి, కానీ జట్టు గెలవకపోతే ఆలోచించాలి. జట్టులో సానుకూల ఆలోచన విధానం అవసరం. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిలి. మా స్పిన్నర్లు, సీఎస్కే స్పిన్నర్లు ఇద్దరూ బాగా బౌలింగ్ చేశారు' అని రహానే తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇవి కూడా చదవండి: