ఐర్లాండ్ చేతిలో ఓటమిపై స్పందించిన అభిషేక్ శర్మ
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:49 AM
పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ భారత్ ఘోరంగా ఓడింది. ఈ పరాజయంపై టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆవేదన వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: విదేశీ పిచ్ పరిస్థితులకు త్వరగా అలవాటు పడకపోవడమే ఐర్లాండ్ చేతిలో భారత జట్టు ఓటమికి ప్రధాన కారణమని యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అభిప్రాయపడ్డాడు. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ జట్టు అద్భుత ప్రదర్శనతో భారత్పై 34 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఏ ఫార్మాట్లోనైనా ప్రపంచ టీ20 ఛాంపియన్ భారత్పై ఐర్లాండ్కు ఇదే తొలి విజయం కావడం విశేషం.
మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. 'నిరంతర షెడ్యూల్తో వెనువెంటనే మ్యాచ్లు ఆడుతున్నప్పుడు, కొద్దిపాటి ప్రాక్టీస్ సెషన్లలోనే అక్కడి వాతావరణానికి, పిచ్ పరిస్థితులకు అలవాటు పడటం ఎంతో కీలకం. ఒక బలమైన జట్టుగా మేము ఆ పనిని వేగంగా చేయాల్సి ఉండింది. ఈ రోజు కూడా మేము అదే ప్రయత్నం చేశాం. కానీ దురదృష్టవశాత్తూ అది వర్కవుట్ కాలేదు' అని తెలిపాడు.
తొలి మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్.. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా, ఐరిష్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు వికెట్లు సమర్పించుకుంది. 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లో 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆదివారం ఇరుజట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నాటికైనా తప్పులను దిద్దుకుని, పరిస్థితులకు త్వరగా అలవాటు పడి బలంగా పుంజుకుంటామని అభిషేక్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
కెప్టెన్గా ఇది ఒక గొప్ప ఆరంభం: టీమిండియా కెప్టెన్ అయ్యర్