Share News

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:34 AM

మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

మహిళా రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్‌భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
Brij Bhushan Sharan Singh

ఇంటర్నెట్ డెస్క్: మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌజ్ అవెన్యూ కోర్టు అదనపు ప్రధాన న్యాయమూర్తి అశ్విని పన్వార్ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో మరో నిందితుడైన డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌ను కూడా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం, బాధితులు ఇచ్చిన వాంగ్మూలాల్లో వ్యత్యాసం కారణంగా కోర్టు ఈ కేసును కొట్టేసింది.


ఆరుగురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ఆధారంగా బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం 2023 జూన్ 15న మహిళల గౌరవానికి భంగం కలిగించడం, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్లు పలు సెక్షన్ల కింద ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2024 మే 10న ట్రయల్ కోర్టు ఐదుగురు మహిళా రెజ్లర్లకు సంబంధించిన ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్‌పై అభియోగాలు నమోదు చేసింది. ఇద్దరు రెజ్లర్లను బెదిరించిన ఆరోపణలపైనా విచారణ కొనసాగింది. అలాగే ఒక మైనర్ రెజ్లర్ కూడా ఆరోపణలు చేసినప్పటికీ, అనంతరం ఆమె ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో పోక్సో చట్టం కింద నమోదైన కేసును పోలీసులు రద్దు చేశారు. తాజా తీర్పుతో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్, వినోద్ తోమర్ ఇద్దరూ ఈ కేసులో నిర్దోషులుగా విడుదలయ్యారు.


ఇవి కూడా చదవండి:

కుల్‌దీప్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ విమర్శలు

టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా శుభదీప్ ఘోష్ నియామకం

Updated Date - Aug 03 , 2026 | 11:41 AM