శ్రీలంకతో టెస్టు సిరీస్: బుమ్రా ఔట్.. ఆకిబ్ నబీకి ఛాన్స్
ABN , Publish Date - Aug 03 , 2026 | 10:48 AM
శ్రీలంకతో టెస్టు సిరీస్కు స్టార్ బౌలర్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్థానంలో జమ్ముకశ్మీర్కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో నబీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ సందర్భంగా మోకాలికి తగిలిన గాయం నుంచి బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. బుమ్రా స్థానంలో జమ్ముకశ్మీర్కు చెందిన యువ పేసర్ ఆకిబ్ నబీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో నబీకి తొలిసారి భారత సీనియర్ జట్టులో చోటు దక్కింది. జమ్ముకశ్మీర్ నుంచి పర్వేజ్ రసూల్, ఉమ్రాన్ మాలిక్ తర్వాత భారత సీనియర్ జట్టుకు ఎంపికైన మూడో క్రికెటర్గా నబీ నిలిచాడు.
29 ఏళ్ల నబీ గత రెండు రంజీ సీజన్లలో మొత్తం 104 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా 2025-26 సీజన్లో 60 వికెట్లు తీసి జమ్ముకశ్మీర్కు తొలి రంజీ ట్రోఫీ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన ఇండియా-ఏ జట్టు తరఫున కూడా రెండు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఆరు వికెట్లు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ప్రాతినిధ్యం వహించాడు.
మరోవైపు, బుమ్రా మోకాలిలో వాపు తొలుత ఊహించిన దాని కంటే తీవ్రంగా ఉండటంతో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వైద్య బృందం అతడిని త్వరగా అంతర్జాతీయ క్రికెట్లోకి దింపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. రాబోయే వరుస సిరీస్లను దృష్టిలో పెట్టుకుని ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా గాయం నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో అతని ఎంపిక ఫిట్నెస్ క్లియరెన్స్పై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. శ్రీలంక-భారత్ తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలే వేదికగా ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
కుల్దీప్ను ఎందుకు పక్కన పెట్టారు?.. గంభీర్, గిల్పై మాజీ క్రికెటర్ విమర్శలు
టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా శుభదీప్ ఘోష్ నియామకం