Bangladesh Requests: భారత్తో ఉద్రిక్తత.. ఐసీసీకి బంగ్లా క్రికెట్ బోర్డు కీలక లేఖ..
ABN , Publish Date - Jan 04 , 2026 | 09:09 PM
టీ20 ప్రపంచ కప్ లో తమ దేశం ఆడే మ్యాచుల వేదికలు మార్చాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి లేఖ రాసింది. భారత్ తో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తత కారణంగా ఈ లేఖను ఐసీసీకి పంపింది.
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజులుగా భారత్, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ(Bangladesh political tensions) ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్ లో తాము ఆడే మ్యాచుల వేదికలను మార్చాలంటూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి లేఖ రాసింది. భారత్ లో తమ జట్టు ఆడే మ్యాచ్ల వేదికలను మార్చాలని అందులో కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇరు దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించామని, భారత్ లో పర్యటించనున్న బంగ్లాదేశ్ ఆటగాళ్ల భద్రతపై తమ దేశంలో ఆందోళనలను వ్యక్తమవుతున్నాయని బీసీబీ తెలిపింది. వాటిని పరిగణనలోకి తీసుకుని, అలానే తమ ప్రభుత్వం నుంచి వచ్చిన సలహా మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో బంగ్లా జట్టు భారత్లో పర్యటించకూడదని బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారని బీసీబీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. బీసీబీ అభ్యర్థనపై ఐసీసీ (ICC) నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అలానే బీసీబీ మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఐపీఎల్ (IPL)లో ఆడేందుకు ముస్తాఫిజుర్ రెహమాన్(Mustafizur Rahman)కు ఇచ్చిన ఎన్ఓసీని బీసీబీ రద్దు చేసింది. ఒకవేళ భవిష్యత్తులో కేకేఆర్ జట్టు తమ నిర్ణయాన్ని మార్చుకున్నా.. ముస్తాఫిజుర్ ఐపీఎల్లో ఆడేందుకు బంగ్లా క్రికెట్ అనుమతించదు.
మరోవైపు ఐసీసీకి బీసీబీ( BCB decision) రాసిన లేఖపై బీసీసీఐ వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి. టోర్నీ ఆరంభానికి నెల రోజుల సమయయే ఉండటంతో వేదికలను మార్చడం అసాధ్యమని చెబుతున్నాయి. ఒకరి ఇష్టానుసారం మీరు వేదికలను మార్చలేరని, ఆటగాళ్ల ప్రయాణపరంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్తో ఆడే ఇతర జట్ల గురించి కూడా ఆలోచించాలని, వారి విమాన టిక్కెట్లు, హోటళ్లు ఇప్పటికే బుక్ అయ్యాయని బీసీసీఐ వర్గాలు వ్యక్తం చేశాయి. టోర్నీలో లీగ్ దశలో ప్రతిరోజు మూడు మ్యాచ్లు ఉంటాయి. ఈ క్రమంలో బ్రాడ్కాస్టింగ్ విషయంలోనూ సమస్యలొస్తాయని, కాబట్టి.. మ్యాచ్ల తరలింపు అనేది అనుకున్నంత ఈజీ కాదని బీసీసీఐ(BCCI) వర్గాలు పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి:
Pakistan T20 World Cup Squad: జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. స్టార్ ప్లేయర్కు షాక్
T20 World Cup 2026: బంగ్లా మ్యాచ్లు శ్రీలంకకు తరలింపు!