Share News

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ.. పతకం ఖాయం

ABN , Publish Date - Aug 21 , 2026 | 02:45 PM

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు ట్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన జియా యి ఫాన్-జాంగ్ షు షియాన్ జోడీపై అద్భుతమైన పోరాటంతో విజయం సాధించిన భారత జోడీ.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ.. పతకం ఖాయం
Treesa Jolly, Gayatri Gopichand

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు ట్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో చైనాకు చెందిన జియా యి ఫాన్-జాంగ్ షు షియాన్ జోడీపై అద్భుతమైన పోరాటంతో విజయం సాధించిన భారత జోడీ.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది. తొలి గేమ్‌లో 16–21తో వెనుకబడిన ట్రీసా-గాయత్రి.. ఆ తర్వాత పుంజుకుంది. పదునైన స్మాష్‌లు, మెరుగైన నెట్ ప్లేతో ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించింది. రెండో గేమ్‌ను 21–15తో, నిర్ణయాత్మక మూడో గేమ్‌ను 21–13తో గెలుచుకుంది. మొత్తం గంటా 9 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ట్రీసా–గాయత్రీ అద్భుతంగా పోరాడారు.


ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో భారత్ చివరిసారిగా 2011లో పతకం సాధించింది. అప్పట్లో జ్వాలా గుత్తా–అశ్విని పొన్నప్ప కాంస్యం గెలిచారు. 15 ఏళ్ల తర్వాత అదే విభాగంలో ట్రీసా–గాయత్రీ పతకాన్ని ఖాయం చేయడం విశేషం.


గాయం నుంచి పునరాగమనం

ట్రీసా–గాయత్రీ గతంలోనూ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించారు. గతేడాది ఆరంభంలో ప్రపంచ టాప్-10లోకి ప్రవేశించారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ట్రీసాకు చీలమండ గాయం కావడంతో ఈ జోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్, ఉబెర్ కప్‌కు ముందు శిక్షణ సమయంలో అనుకోకుండా గాయపడిన ఆమెకు ఎంఆర్‌ఐలో రెండు తీవ్రమైన కండరాల చీలికలు, రెండు లిగమెంట్ టియర్లు ఉన్నట్లు తేలింది. సుదీర్ఘ పునరావాసం అనంతరం ట్రీసా–గాయత్రీ ఇండోనేషియా ఓపెన్‌లో తిరిగి బరిలోకి దిగారు. అనంతరం యూఎస్ ఓపెన్‌లో ఆడిన ఈ జోడీ.. ఈ నెల ప్రారంభంలో ఫిలిప్పీన్స్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్ చేరి భారత్‌కు పతకం ఖాయం చేసింది.


ఇవి కూడా చదవండి:

22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా టీమిండియా మాజీ క్రికెటర్

ఫిఫా మహిళల ప్రపంచ కప్ 2027 షెడ్యూల్ విడుదల..

Updated Date - Aug 21 , 2026 | 03:09 PM