ఆసియా క్రీడలు: క్రికెట్ షెడ్యూల్ విడుదల.. నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి టీమిండియా
ABN , Publish Date - Jul 24 , 2026 | 03:52 PM
జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్ను నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2026లో క్రికెట్ పోటీల షెడ్యూల్ను నిర్వాహకులు విడుదల చేశారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్లో క్రికెట్ నాలుగోసారి చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మహిళల టీ20 మ్యాచ్లు సెప్టెంబర్ 17న ప్రారంభం కానుండగా.. పురుషుల టోర్నీ సెప్టెంబర్ 24 నుంచి మొదలు కానుంది. అన్ని మ్యాచ్లు టీ20 ఫార్మాట్లో జరగడంతో పాటు పూర్తి అంతర్జాతీయ హోదా కలిగి ఉండనున్నాయి. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన భారత పురుషుల, మహిళల జట్లు ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగనున్నాయి.
నేరుగా క్వార్టర్ ఫైనల్లో భారత్..
పురుషుల విభాగంలో టాప్ సీడ్ జట్లు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక నేరుగా క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాయి. ఇక గ్రూప్-ఎలో అఫ్గానిస్థాన్, జపాన్, నేపాల్.. గ్రూప్-బిలో హాంకాంగ్ చైనా, మలేషియా, ఒమన్ జట్లు మిగిలిన నాలుగు క్వార్టర్ ఫైనల్ స్థానాల కోసం పోటీపడనున్నాయి. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. కాగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈ టోర్నీలో లీగ్ లేదా క్వార్టర్ ఫైనల్లో జరిగే అవకాశం లేదు. ఇరు జట్లు సెమీఫైనల్ లేదా ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుంది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్-పాక్ పోరు జరగాలంటే రెండు జట్లు చివరి దశ వరకు చేరాల్సిందే.
జపాన్తో భారత మహిళల తొలి పోరు
భారత మహిళల క్రికెట్ జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్తో తలపడనుంది. ఆ మ్యాచ్లో గెలిస్తే సెమీఫైనల్లో బంగ్లాదేశ్ లేదా చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు శ్రీలంక-మలేషియా, పాకిస్థాన్-థాయ్లాండ్ మధ్య మిగిలిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మహిళల జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగుతుండగా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. పురుషుల జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా ఉండనున్నాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో చోటు లభించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విశ్వనాథన్ ఆనంద్
నా హాఫ్ సెంచరీ వారందరికీ అంకితం: వైభవ్ సూర్యవంశీ