స్క్వాష్ ఛాంపియన్షిప్: చరిత్ర సృష్టించిన అనహత్ సింగ్.. ప్రధాని మోదీ ప్రశంసలు
ABN , Publish Date - Jul 26 , 2026 | 07:11 PM
ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత యువ సంచలనం అనహత్ సింగ్ స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా అనహత్ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెపై ప్రశంసలు కురిపించారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత యువ సంచలనం అనహత్ సింగ్ స్వర్ణం గెలిచింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా అనహత్ చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అనహత్ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. యువతలో స్క్వాష్ క్రీడపై ఆసక్తిని మరింత పెంచుతుందని తెలిపారు.
18 ఏళ్ల అనహత్ సింగ్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈజిప్ట్కు చెందిన రెండో సీడ్ ప్లేయర్లలో ఒకరైన రుకయ్య సలేమ్ను 11-3, 11-7, 11-9 తేడాతో ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది. టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన అనహత్.. ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్గా నిలవడం విశేషం. ఈ విజయంతో ప్రపంచ జూనియర్ స్క్వాష్ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా మాత్రమే కాకుండా, 2010 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి నాన్-ఈజిప్టియన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. గత 15 ఏళ్లుగా ఈ టోర్నీపై ఉన్న ఈజిప్ట్ ఆధిపత్యానికి అనహత్ తెరదించింది.
చిన్న వయసులోనే పెద్ద విజయాలు
అనహత్ సింగ్ ఇప్పటికే భారత స్క్వాష్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. 2022 ఆసియా క్రీడల్లో కేవలం 15 ఏళ్ల వయసులోనే రెండు కాంస్య పతకాలు సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించింది. సీనియర్ జాతీయ స్క్వాష్ ఛాంపియన్షిప్లో 2023 నుంచి వరుసగా మూడేళ్లపాటు విజేతగా నిలిచింది. తొలుత బ్యాడ్మింటన్ ఆడిన అనహత్.. తన సోదరి అమీరాను చూసి స్క్వాష్వైపు ఆకర్షితురాలైనట్లు ఓ సందర్భంలో వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్