Share News

సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం చాలా కష్టం: అఫ్గానిస్థాన్ కోచ్

ABN , Publish Date - Jun 05 , 2026 | 07:52 PM

అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో శనివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గానిస్థాన్ కోచ్ రిచర్డ్ పైబస్ మాట్లాడాడు.

సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం చాలా కష్టం: అఫ్గానిస్థాన్ కోచ్
Richard Pybus

ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. టీమిండియాతో శనివారం నుంచి ఏకైక టెస్టు మ్యాచ్ ముల్లాన్‌పూర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అఫ్గానిస్థాన్ కోచ్ రిచర్డ్ పైబస్ మాట్లాడాడు. స్వదేశంలో భారత జట్టును ఓడించడం ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత కఠినమైన సవాళ్లలో ఒకటని అభిప్రాయపడ్డాడు. ఈ క్రమంలో అతడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.


‘భారత్‌కు వచ్చి స్వదేశంలోనే టీమిండియాతో ఆడటం, వారిని ఓడించడం అత్యంత కఠినమైన విషయం. భారత ప్లేయర్ల ప్రతిభ మాత్రమే కాదు.. స్వదేశీ పిచ్‌ పరిస్థితులపై ఉన్న అవగాహన కూడా వారిని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది. అందుకే స్వదేశంలో టీమిండియాను ఓడించడం చాలా కష్టం’ అని రిచర్డ్ వెల్లడించాడు.


దీంతోపాటు అఫ్గానిస్థాన్‌కు మరిన్ని టెస్టు అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా రిచర్డ్ ఐసీసీని కోరాడు. ‘2018లో టెస్టు హోదా పొందిన అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు ఇప్పటి వరకు పూర్తి స్థాయి టెస్టు షెడ్యూల్ లేదు. హోదా ఇవ్వడం ఒక విషయం. కానీ ఆ తర్వాత క్రమబద్ధమైన షెడ్యూల్ కూడా ఉండాలి. ఒక్కోసారి ఒకే టెస్టు ఆడి, మళ్లీ ఐదు నెలల విరామం తీసుకోవడం వల్ల ప్లేయర్లు నేర్చుకునే అవకాశాలు తగ్గిపోతాయి. మూడు లేదా ఐదు టెస్టుల సిరీస్‌లు ఉంటేనే జట్టు అభివృద్ధి చెందుతుంది. రెండు టెస్టుల సిరీస్ పెట్టడంలో కూడా అర్థం లేదు. అలాంటప్పుడు సిరీస్ డ్రాగా ముగిసే అవకాశం ఉంటుంది. నిజమైన పోటీ ఉండాలంటే కనీసం మూడు లేదా ఐదు టెస్టుల సిరీస్ అవసరం’ అని పైబస్ వెల్లడించాడు.


రషీద్ ఖాన్ రిటైర్ అవుతాడా?

గత కొంతకాలంగా అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ రిటైర్ అవుతాడంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా కోచ్ పైబస్ స్పందించాడు. ‘రషీద్ చాలా కాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్‌ల్లో ఆడటం వల్ల అతడిపై భారం పడుతోంది. అతడి ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అయితే భవిష్యత్తులో మరికొంతకాలం టెస్టు క్రికెట్ ఆడే విషయంపై అతడితో చర్చిస్తాం’ అని పైబస్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్!

మహారాజా టీ20 టోర్నీ: వేలంలో కేఎల్ రాహుల్ అన్‌సోల్డ్!

Updated Date - Jun 05 , 2026 | 07:52 PM