గాలే టెస్టులో భారత్ ఓడిపోవచ్చు.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 18 , 2026 | 10:01 AM
శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్టులో భారత్ పటిష్ఠమైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా గెలుపు కోసం మాజీ క్రికెటర్ అకాశ్ చోప్రా పలు సూచనలు చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలంటే ప్రత్యేకమైన వ్యూహంతో వెళ్లాలని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. మ్యాచ్లో గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి భారత జట్టు సుమారు 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి.. ప్రత్యర్థి జట్టుకు సుమారు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాలని అతడు సూచించాడు. వర్షం ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవాలని ఆకాశ్ పేర్కొన్నాడు. ఈ క్రమంలో భారత్ ఓడిపోవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ప్రస్తుత స్కోరుకు మరో 178 పరుగులు జోడించి 350కి చేరుకోవాలని తెలిపాడు. ఓవర్కు సగటున ఐదు పరుగులు సాధించినా, 200 పరుగులు చేయడానికి 40 ఓవర్లు పడుతుందని తెలిపాడు. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వేగంగా ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 'కేఎల్ రాహుల్ తనలోని టీ20, వన్డే తరహా బ్యాటింగ్ శైలీని యాక్టివేట్ చేసి వేగంగా పరుగులు సాధించాలి' అని చోప్రా పేర్కొన్నాడు.
అయితే, ఈ దూకుడు వ్యూహంలో కొన్ని నష్టభయాలు కూడా ఉన్నాయని ఆయన హెచ్చరించాడు. ఒకవేళ పూర్తి ఓవర్లు ఆట సాగి, శ్రీలంక జట్టు ఆ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో భారత్ ఓడిపోయే ప్రమాదం కూడా లేకపోలేదన్నాడు. అయినప్పటికీ, వర్షం వల్ల సమయం వృథా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, సురక్షితంగా ఆడుతూ కాలయాపన చేస్తే మ్యాచ్ను గెలుచుకునే అవకాశం చేజారిపోతుందని ఆకాశ్ విశ్లేషించాడు.
ఇవి కూడా చదవండి:
శ్రీలంక టెస్ట్ మ్యాచ్ లైవ్లో సంజయ్ మంజ్రేకర్, కార్తీక్ వాగ్వాదం!
భారత్ బౌలర్లను చిత్తు చేసిన సోనల్.. ఈ లంక స్టార్ ఎవరో తెలుసా?