ఆన్లైన్లో ఆండ్రాయిడ్ పరికరం కోసం ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేయగానే షాక్..!
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:15 PM
ఆన్లైన్లో మోసాలు జరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మోసపోతూనే ఉంటారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్లైన్లో మోసాలు జరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ మోసపోతూనే ఉంటారు. ఓ వ్యక్తి ఆన్లైన్లో ఆండ్రాయిడ్ పరికరం కొనుగోలు చేశాడు. తీరా పార్సిల్ చేతికి అందిన తర్వాత కవర్ విప్పి చూసి.. షాక్ అయ్యాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది. గ్రేటర్ నోయిడాలోని దంకోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకాష్ ఇటీవల ఆన్లైన్లో రూ.1,999 నగదు చెల్లించి.. ఆండ్రాయిడ్ పరికరాన్ని కొనుగోలు చేశాడు.
రెండు రోజుల తర్వాత అతడికి ఆ పరికరం పార్సిల్ అందింది. ఆ పార్సిల్ విప్పి చూసి.. అతడు షాక్కు గురయ్యాడు. ఆ కవర్లో ఎండిన ఆవు పేడను గుర్తించాడు. దీంతో ఆందోళనకు గురైన అతడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆండ్రాయిడ్ పరికరం బుకింగ్ కోసం వినియోగించిన వెబ్సైట్, చెల్లింపు లావాదేవీలతోపాటు కొరియర్ డెలివరీ వివరాలను పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కొనుగోలుదారులకు సైబర్ పోలీసులు హెచ్చరించారు. వినియోగదారులు ధ్రువీకరించిన కంపెనీలు, వెబ్సైట్ల ద్వారానే కొనుగోలు చేయాలని ప్రజలకు స్పష్టం చేశారు.