మేకను తినేందుకు వచ్చిన కొండచిలువ.. మద్యం మత్తులో యువకుడు ఏం చేశాడంటే..
ABN , Publish Date - Aug 16 , 2026 | 08:00 AM
ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది.
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని బారాబంకిలో మద్యం మత్తులో ఓ యువకుడు చేసిన పని నెట్టింట అందరినీ షాక్కు గురి చేసింది. ఏకంగా కొండచిలువను పట్టుకుని మెడలో వేసుకోవడం కలకలం రేపింది. జనావాసాల మధ్యకు వచ్చిన పామును మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు పట్టుకున్నాడు. అనంతరం దానితో ఆడుకుంటూ హంగామా చేశాడు. దీంతో కొండచిలువ, యువకుడికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్గా మారింది.
స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి సమయంలో బారాబంకి ప్రాంతంలోకి ఓ కొండచిలువ వచ్చింది. స్థానికంగా ఉన్న మాంసం దుకాణంలోని మేకను తినేందుకు లోపలికి వెళ్లింది. దీనిని గమనించిన షాపు యజమాని తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. అంత పెద్ద పామును ఒక్కసారిగా చూడటంతో షాక్ అయ్యాడు. షాపు యజమాని వెంటనే గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా పెద్దఎత్తున గుమిగూడారు. 15 అడుగుల కొండచిలువను వారంతా ఆశ్చర్యంగా చూశారు.
ఇంతలో మద్యం మత్తులో ఉన్న సురేశ్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. పామును చూసిన వెంటనే ఎలాంటి భయం లేకుండా నేరుగా దాని వద్దకు వెళ్లాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా యువకుడిని అది రెండు సార్లు కాటు వేసింది. కొండచిలువకు విషం ఉండకపోవడంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, పాము దాడిని ఏమాత్రం లెక్కచేయని సురేశ్ తన చేతులతోనే దానిని పట్టుకున్నాడు. ఈ క్రమంలో అది అతని చేతిని పలుమార్లు చుట్టేసింది. మద్యం మత్తులో సురేశ్ చేసిన సాహసానికి స్థానికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆ తర్వాత పాముతో అతను కాసేపు విన్యాసాలు చేశాడు. దానిని ఏకంగా తన మెడలో వేసుకుని హంగామా చేశాడు. అనంతరం పెద్ద పాత్రలో బంధించి దూరంగా తీసుకెళ్లి వదిలిపెట్టారు. కాగా, ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్న యువత తమ సెల్ఫోన్ కెమెరాల్లో బంధించారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్గా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
మోనాలిసా కాదు.. ‘కన్వర్ యాత్ర వైరల్ షేర్నీ’గా పిలవండి: మాన్సీ ఠాకూర్
ప్రాణాలు పోయేచోట ఫొటోకు ఫోజులు.. చూస్తే గుండె ఆగిపోవాల్సిందే..