అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్..
ABN , Publish Date - Aug 28 , 2026 | 01:25 PM
అమెరికాలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మను హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ యువతి నిఖిత గోదిశాల (27) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య కేసు నిందితుడు, ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ (26)ను హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. ఈ హత్య కేసులో భాగంగా ఇప్పటికే నిందితుడిపై అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో ప్రస్తుతం అమెరికా అధికారులకు అర్జున్ శర్మను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.
హైదరాబాద్కు చెందిన నిఖిత గోదిశాల అమెరికాలోని మేరీల్యాండ్లోని ఎల్లికాట్ సిటీలో ఉద్యోగం చేస్తోంది. ఆమె కనిపించడం లేదంటూ జనవరి 2న ఫిర్యాదు అందడంతో హోవర్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేరీల్యాండ్లోని అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో శర్మపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్యారోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో నిందితుడు భారత్కు పారిపోయి వచ్చాడు. మరోవైపు, డిసెంబర్ 31, 2025న నిఖిత హత్యకు గురైనట్లు బాధిత కుటుంబ సభ్యులకు భారత అధికారులు సమాచారం అందించారు.
నిఖిత తండ్రి ఆనంద్ గోదిశాల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలంగాణలోనూ అర్జున్పై మోసం కేసు నమోదైంది. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏప్రిల్లో కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో లభించిన ఆధారాలతో ఆగ్రాలో అర్జున్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ప్రత్యేక బృందం అక్కడికి వెళ్లి ఓ ఫ్లాట్లో అతడిని అదుపులోకి తీసుకుంది. అనంతరం హత్య కేసు దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించారు. న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ఆగస్టు 25న హాజరుపరుచగా.. హత్యకు సంబంధించిన కేసులో రిమాండ్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి
మా తండ్రిని చంపేందుకు పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: ఇమ్రాన్ కుమారులు
సహాయక చర్యలు నిలిపివేసిన చైనా..