భారతావనిలో ఉగాది సంబరం
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:48 AM
చైత్రమాసం రాకతో ప్రకృతి సరికొత్త సొగసులు అద్దుకుంటుంది. ఎండిన ఆకులు రాలిపోయి చిగురించిన కొమ్మలతో చెట్లు కళకళలాడుతుంటాయి. కోయిలమ్మ కుహుకుహు రాగాలు..
చైత్రమాసం రాకతో ప్రకృతి సరికొత్త సొగసులు అద్దుకుంటుంది. ఎండిన ఆకులు రాలిపోయి చిగురించిన కొమ్మలతో చెట్లు కళకళలాడుతుంటాయి. కోయిలమ్మ కుహుకుహు రాగాలు.. వేపపువ్వు విలక్షణమైన పచ్చి వాసన కొత్త ఏడాది రాకను గుర్తుచేస్తుంది. ఇది కేవలం కాలం మారడం కాదు.. మనిషి ఆలోచనా దృక్పథం మారే సమయం. అందుకే భారతీయులందరూ తమ ప్రాంతీయ సంప్రదాయాల ప్రకారం ఈ ఉగాదిని అత్యంత వైభవంగా జరుపుకొంటారు.
ఈ ఏడాది మనం పరాభవ నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. తెలుగు కాలచక్రంలోని 60 సంవత్సరాలలో ఇది 40వది. సాధారణంగా పరాభవం అంటే అవమానం అనే అర్థం స్ఫురించవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా దీనికి లోతైన అర్థం ఉంది. ‘పరేశాం అభవః’ అంటే ఇతరుల పట్ల ద్వేషం లేకపోవడం లేదా మనలోని అహంకారాన్ని ‘పరాభవం’ (ఓడించడం) చేయడం అని అర్థం. ఈ ఏడాది అహంకారాన్ని వీడి వినయంతో మెలగడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పంచాంగకర్తలు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా ‘నూతన’ వైభవం
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. కాలగణనలో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ వసంతకాలం రాకను దేశమంతా పండుగలా చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ పండుగను ఏయే రాష్ట్రాల్లో ఎలా జరుపుకొంటారో చూద్దాం.
తెలుగు రాష్ట్రాలు: షడ్రుచుల ఉగాది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగాది అంటేనే ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచుల సమ్మేళనంతో చేసే ఈ పచ్చడి.. జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలని బోధిస్తుంది. ఇళ్లను మామిడి ఆకులతో తోరణాలు కట్టి, కొత్త బట్టలు ధరించి, దేవాలయాల్లో జరిగే పంచాంగ శ్రవణంలో పాల్గొనడం ఇక్కడి ఆచారం.
కర్ణాటక: బేవు-బెల్ల
కన్నడిగులు దీనిని ‘యుగాది’ అని పిలుస్తారు. తెలుగువారికీ, కన్నడిగులకు సంప్రదాయాల్లో చాలా పోలికలు ఉన్నాయి.
ప్రత్యేక వంటకం: కర్ణాటకలో ఉగాది పచ్చడికి బదులుగా ‘బేవు-బెల్ల’ ప్రసాదాన్ని పంచుకుంటారు. బేవు అంటే వేప (చేదు), బెల్ల అంటే బెల్లం (తీపి). కష్టసుఖాలు రెండూ సమానమే అని చాటిచెప్పడమే దీని ఉద్దేశం.
పిండి వంటలు: ఇక్కడ దేవుడికి నైవేద్యంగా ‘ఓబట్టు’ (బొబ్బట్టు) అత్యంత ప్రధానమైన వంటకం.
పంజాబ్: బైశాఖి
ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్లో దీనిని ‘బైశాఖి’గా జరుపుకొంటారు. ఇది రైతులకు అతిపెద్ద పండుగ.
పంటల పండుగ: శీతాకాలపు పంట (రబీ) చేతికి వచ్చే సమయం కావడంతో రైతులు అత్యంత ఉత్సాహంగా ఉంటారు.
సంబరాలు: రంగురంగుల దుస్తులు ధరించి పురుషులు ‘భాంగ్రా’, మహిళలు ‘గిద్దా’ నృత్యాలతో వీధుల్లో ఊరేగింపులు చేస్తారు. సిక్కులకు ఇది మతపరంగా కూడా పవిత్రమైన రోజు (ఖల్సా పంథా స్థాపన జరిగిన రోజు). పిండి వంటల్లో భాగంగా ఇక్కడ ‘కడ ప్రసాద్’ (గోధుమ హల్వా) ప్రత్యేకం.
పశ్చిమ బెంగాల్: పొయిలా బైశాఖ్
బెంగాలీలకు ఇది ‘నోబో బోర్షో’ (నూతన సంవత్సరం). ఇది సాధారణంగా వారికి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. ఇది వారికి అత్యంత పవిత్రం.
వ్యాపార శుభారంభం: వ్యాపారులు ‘హల్ ఖాతా’ పేరిట కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు. ఇళ్లలో లక్ష్మీదేవికి, గణేశుడికి పూజలు చేస్తారు.
వంటలు: బెంగాలీ మిఠాయిలైన ‘సందేష్’, ‘రసగుల్లా’తోపాటు రకరకాల చేపల వంటకాలు ఈ పండుగ రోజున తప్పనిసరిగా కనిపిస్తాయి.
మహారాష్ట్ర, గోవా:
గుడి పడ్వా
మరాఠీ, గోవా ప్రజలు చైత్య శుద్ధ పాడ్యమిని ‘గుడి పడ్వా’గా జరుపుకొంటారు. ఛత్రపతి శివాజీ సాధించిన విజయాలకు గుర్తుగా కూడా దీనిని భావిస్తారు.
పూజలు: ఇంటి ముందు ఒక వెదురు కర్రకు పట్టు వస్త్రాన్ని కట్టి దానిపై వెండి లేదా రాగి కలశాన్ని బోర్లించి, వేప ఆకులు, పూల మాలలతో అలంకరిస్తారు. దీనినే గుడి అంటారు. ఇది విజయానికి సూచిక.
వంటకాలు: ఇక్కడ పచ్చడికి బదులుగా వేపపూవు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని తింటారు. ముఖ్యంగా ‘శ్రీఖండ్‘ (పెరుగుతో చేసిన తీపి పదార్థం), పూరి, పూరన్పోళి (బొబ్బట్లు) ఇక్కడి ప్రధాన వంటకాలు.
మణిపూర్: సజిబు నొంగ్మా పాన్బా
ఈశాన్య భారతదేశంలో కూడా ఈ పండుగ కనిపిస్తుంది. మణిపూర్లో దీనిని ‘సజిబు నొంగ్మా పాన్బా’ అని పిలుస్తారు.
విశిష్ఠత: ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని, వండిన వంటకాలను ముందుగా ఇంటి దైవానికి నైవేద్యంగా పెడతారు.
ఆచారం: భోజనం తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి సమీపంలోని కొండలు ఎక్కుతారు. ఇది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్షకు ప్రతీక.
కశ్మీర్: నవ్రే
హిమగిరుల సాక్షిగా కశ్మీరీ పండిట్లు జరుపుకొనే పండుగ ‘నవ్రే’.
పూజలు: పండుగ రోజున ఉదయాన్నే ఒక పళ్లెంలో బియ్యం, పెరుగు, ఉప్పు, పంచాంగం, పూలను ఉంచి, నిద్ర లేవగానే మొదటి చూపుగా దానిని చూస్తారు. దానిని శుభప్రదంగాభావిస్తారు.
కేరళ: విషు
కేరళలో ‘విషు’ పేరుతో సౌరమాన నూతన సంవత్సరాన్ని జరుపుకొంటారు. ఓణం వారికి ప్రధాన సాంస్కృతిక పండుగ అయితే, జ్యోతిష్య రీత్యా కొత్త ఏడాదికి స్వాగతం పలికేది మాత్రం ‘విషు’ పండుగే. ఈ రోజున ‘విషుకని’ దర్శనం వారి ప్రత్యేక ఆచారం.
విషుకని: పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కళ్లు మూసుకుని పూజాగదికి వెళ్లి, అక్కడ ముందుగా అమర్చిన కృష్ణుడి విగ్రహం, పండ్లు, పువ్వులు, బంగారం, అద్దం వంటి శుభప్రదమైన వస్తువులను చూడటాన్ని ‘విషు కని’ అంటారు. ఇలా చేస్తే ఏడాది పొడవునా ఐశ్వర్యం కలుగుతుందని వారి నమ్మకం.
ఈ వార్తలు కూడా చదవండి..
సిలిండర్లు బ్లాక్మార్కెట్కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు
మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్
గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News