కునుకు తీద్దాం రండి
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:00 AM
నగర జీవనంలో పరుగే పరుగు.. ఉదయం అలారంతో మొదలై రాత్రి మొబైల్ నోటిఫికేషన్ల వరకు నిద్ర అనేది అందని ద్రాక్షలా మారుతోంది. ఈ నేపథ్యంలో కోల్పోయిన...
లైఫ్
నగర జీవనంలో పరుగే పరుగు.. ఉదయం అలారంతో మొదలై రాత్రి మొబైల్ నోటిఫికేషన్ల వరకు నిద్ర అనేది అందని ద్రాక్షలా మారుతోంది. ఈ నేపథ్యంలో కోల్పోయిన ప్రశాంతతను, గాఢ నిద్రను తిరిగి పొందేందుకు ఆధునిక మానవుడు ‘స్లీప్ టూరిజం’ బాట పడుతున్నాడు.
సెలవులంటే ఒకప్పుడు విహారయాత్రలు, షాపింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్ గుర్తుకు వచ్చేవి. కానీ మారుతున్న కాలంతోపాటు పర్యాటక నిర్వచనం కూడా మారుతోంది. ఇప్పుడు పర్యాటకులు కొత్త ప్రదేశాలు చూడటం కంటే, కంటి నిండా నిద్రపోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘స్లీప్ వెకేషన్స్’ పేరుతో ప్రాచుర్యం పొందుతున్న ఈ సరికొత్త ట్రెండ్ వెల్నెస్ ప్రపంచంలో ఒక విప్లవంగా మారుతోంది. పతి ఒత్తిడి, నిరంతర డిజిటల్ పరధ్యానం మధ్య చిక్కుకున్న సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇప్పుడు నిద్రను వెతుక్కుంటూ ప్రశాంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
విశ్రాంతికి పట్టాభిషేకం
సాధారణ హోటళ్లలో విలాసవంతమైన గదులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. కానీ, స్లీప్ టూరిజం రిసార్టులు దీనికి పూర్తిగా భిన్నం. ఇక్కడ ప్రతి అడుగు మీ నిద్రను ప్రేరేపించేలా ఉంటుంది. శబ్దం లోపలికి రాకుండా గదులను పూర్తిగా సౌండ్ప్రూఫ్ చేస్తారు. కిటికీలను అమర్చే బ్లాక్ అవుట్ కర్టెన్లు పగటిపూట కూడా గాఢాంధకారాన్ని సృష్టిస్తాయి. పరుపులు, దిండ్లు సైతం శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా స్పందించే అధునాతన టెక్నాలజీతో రూపొందిస్తారు. గదిలోకి వెళ్లగానే స్మార్ట్ఫోన్లు, ల్యాప్టా్పలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. టీవీలు, వైఫైలు లేని ఈ గదుల్లో మౌనం మాత్రమే రాజ్యమేలుతుంది.
నిద్రకు సైన్స్తో ముడి
ఇది నిద్రపోవడం మాత్రమే కాదు, ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఈ రిసార్టులలో ‘స్లీప్ కోచ్’లు ఉంటారు. వారు పర్యాటకుల నిద్ర తీరును అధ్యయనం చేసి వారి మెదడు ఏ సమయంలో ప్రశాంతంగా ఉంటుందో విశ్లేషిస్తారు. అరోమా థెరపీ, మెడిటేషన్, యోగా, నిద్ర వంటి ప్రక్రియల ద్వారా మనసును కుదుటపరుస్తారు. నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అధికంగా ఉండే ప్రత్యేకమైన ఆహార పదార్థాలను, మూలికా టీలను అందిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, మొరాయించిన యంత్రాన్ని సర్వీసింగ్ చేసినట్టుగా అలసిపోయిన శరీరాన్ని ఈ వెకేషన్లు రీచార్జ్ చేస్తాయి.
ఎందుకీ ఆరాటం?
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం మంది నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యతో బాధపడుతున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. దీనివల్ల రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, మానసిక కుంగుబాటు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. మనిషి తన ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవడంతో మందుల కంటే సహజ నిద్ర మేలని గుర్తిస్తున్నాడు. వేల రూపాయలు ఖర్చు చేసి మరీ ఈ నిద్ర పర్యటనలకు మొగ్గు చూపుతున్నాడు. లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ సంస్కృతి ఇప్పుడు భారత మెట్రో నగరాల్లోనూ వేగంగా విస్తరిస్తోంది.
ప్రాథమిక హక్కు
నిద్ర అనేది ప్రకృతి మనకిచ్చిన సహజ సిద్ధమైన వరమే కాదు, అది మన ప్రాథమిక హక్కు కూడా. వేగంగా పరిగెడుతున్న ప్రపంచంలో ఒక్క క్షణం ఆగి కళ్లు మూసుకుని మనల్ని మనం రీసెట్ చేసుకోవడం విలాసం కాదు, అత్యవసరం. స్లీప్ వెకేషన్ అనేది ఒక ట్రెండ్ మాత్రమే కాదు, అది మన శరీరానికి మనమిచ్చే అతిపెద్ద గౌరవం. ఆ హాయిని అనుభవించినప్పుడే మనిషి మళ్లీ సరికొత్త ఉత్సాహంతో తన దైనందిన జీవితంలోకి అడుగుపెట్టగలడు.
ఇవి కూడా చదవండి..
ఆర్థిక శాఖ మినహా సునేత్రకు మూడు శాఖలు..
మహారాష్ట్ర డీసీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సునేత్ర పవార్
For More National News And Telugu News