Share News

మంత్రి శశి పంజా ఇంటిపై రాళ్ల దాడి.. యుద్ధక్షేత్రంగా మారిన కోల్‌కతా!

ABN , Publish Date - Mar 14 , 2026 | 05:52 PM

అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో కోల్‌కతా నగరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. రాష్ట్ర మంత్రి శశి పంజా నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది.

మంత్రి శశి పంజా ఇంటిపై రాళ్ల దాడి.. యుద్ధక్షేత్రంగా మారిన కోల్‌కతా!
Shashi Panja house attack

కోల్‌కతా, ఫిబ్రవరి 14: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో నగరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. రాష్ట్ర మహిళా మంత్రి శశి పంజా నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది.

మంత్రి ఇంటిపై రాళ్ల దాడి

కోల్‌కతాలోని గిరీష్ పార్క్ సమీపంలో ఉన్న మంత్రి శశి పంజా నివాసంపై శనివారం మధ్యాహ్నం బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్తున్న క్రమంలో నినాదాలు చేస్తూ వచ్చిన కొందరు వ్యక్తులు ఒక్కసారిగా ఇంటిపైకి రాళ్లు, గాజు బాటిళ్లు విసిరారని, బాంబులతో కూడా దాడి చేశారని మంత్రి స్వయంగా ఆరోపించారు.

50 మందికి పైగా గాయాలు

ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీఎంసీ కార్యకర్తలపై బీజేపీ గూండాలు విరుచుకుపడ్డారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఘర్షణల్లో సుమారు 50 మందికి పైగా తృణమూల్ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపు చేసే క్రమంలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం.


బీజేపీ గూండాలే కారణం: శశి పంజా

ఈ ఘటనపై మంత్రి శశి పంజా తీవ్రంగా స్పందించారు. 'బీజేపీ కార్యకర్తలు కాదు, వారు హంతకులు. ముందస్తు ప్రణాళికతోనే రాళ్లు, బాంబులతో నా ఇంటిపై దాడి చేశారు. నన్ను కూడా లోపలికి తోసేయడం వల్ల తృటిలో ప్రాణాపాయం తప్పింది. బెంగాల్‌లో ఇలాంటి అరాచక సంస్కృతి గతంలో ఎన్నడూ లేదు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

భారీగా పోలీసు మోహరింపు

ఈ ఘటనతో గిరీష్ పార్క్ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌లో ఉన్న తరుణంలో జరిగిన ఈ హింసాత్మక ఘటనలు బెంగాల్ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతున్నాయి.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ దాటిన 2 భారత ఎల్పీజీ నౌకలు.. ఫలించిన భారత్ దౌత్యం

సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

Updated Date - Mar 14 , 2026 | 06:00 PM