అవినీతిని అస్సలు ఉపేక్షించవద్దని సీఎం విజయ్ పిలుపు
ABN , Publish Date - Aug 15 , 2026 | 03:13 PM
తమిళనాడు CM విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అస్సలు ఉపేక్షించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ బంధువులకు, జెన్ జీ మిత్రులకు నా వణక్కమ్ అని ప్రసంగాన్ని ప్రారంభించారు.
చెన్నై, ఆగస్టు 15: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని చరిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రాంగణంలో నిర్వహించిన తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసంగం ప్రారంభంలోనే జెన్ జీ (Gen Z) యువతను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ 'వణక్కమ్ జెన్ జీ' అని పలకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తమిళ బంధువులకు, జెన్ జీ మిత్రులకు నా వణక్కమ్' అని విజయ్ పేర్కొన్నారు. ఈ వేడుకలో విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఎ. చంద్రశేఖర్, శోభలతో పాటు నటి త్రిష మొదటి వరుసలో ఆసీనులయ్యారు.
ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు
రాష్ట్ర హక్కుల పరిరక్షణ: కేంద్ర ప్రభుత్వానికి పరిపాలనాపరమైన అంశాల్లో పూర్తి సహకారం అందిస్తూనే, రాష్ట్ర హక్కులకు భంగం కలిగించే విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు.
అవినీతిపై ఉక్కుపాదం: అవినీతి రహిత పాలనే నిజమైన స్వాతంత్ర్యమని, ప్రభుత్వ ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నామని తెలిపారు. అవినీతిని అంతమొందించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు.
ప్రత్యర్థులకు హెచ్చరిక: తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న శక్తులను, కుట్రలను కచ్చితంగా తిప్పికొడతామని హెచ్చరించారు.
గత సంక్షేమ పథకాల కొనసాగింపు: ప్రజలకు ఉపయోగపడే పాత పథకాలను తాము కొనసాగిస్తున్నామని చెబుతూ, AIADMK ప్రవేశపెట్టిన 'అమ్మ ఉణవగం' (అమ్మ క్యాంటీన్లు), DMK తీసుకొచ్చిన పాఠశాల విద్యార్థుల 'టిఫిన్ పథకం' వంటి వాటిని ఉదాహరణగా ప్రస్తావించారు.
కొత్త పథకాలు.. వరాల జల్లులు
తాయ్మామన్ తంగ మోదిరం థిట్టమ్: ద్రావిడ సిద్ధాంతకర్త సీ.ఎన్. అన్నాదురై జయంతి సందర్భంగా సెప్టెంబర్ 15న రూ. 755.83 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే నవజాత శిశువులకు బంగారు ఉంగరం ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నారు.
మాజీ సైనికుల కుమార్తెలకు పెళ్లి సహాయం: మాజీ సైనికుల కుమార్తెల వివాహ ఆర్థిక సహాయాన్ని రూ.25,000 నుంచి, రూ.50,000కు పెంచారు (గరిష్ఠంగా ఇద్దరు కుమార్తెలకు ఈ ఆర్థిక సాయం వర్తిస్తుంది).
దివ్యాంగ మాజీ సైనికులకు పింఛను: దివ్యాంగులైన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు నెలావారీ సహాయాన్ని రూ.5,000 నుంచి, రూ.7,000కు పెంచారు.
స్వాతంత్ర్య సమరయోధులకు నజరానా: స్వాతంత్ర్య సమరయోధుల పింఛనును రూ.23,000కు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల పింఛనును రూ.12,500కు పెంచుతున్నట్లు ప్రకటించారు.
కుల, మత, ధన, బల ప్రయోగాలను పక్కనపెట్టి ప్రజల ఆధారిత, సామాజిక న్యాయ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మద్దతు ఇచ్చిన తమిళనాడు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అవినీతి పట్ల ప్రజల్లో 'జీరో టాలరెన్స్' (సహించని వైఖరి) ఉండాలని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు
Read Latest AP News And Telugu News