UPI చెల్లింపులపై ఛార్జీలు.. బిల్లుకు లోక్సభ ఆమోదం
ABN , Publish Date - Aug 06 , 2026 | 06:47 PM
UPI లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. డిజిటల్ చెల్లింపు సేవలపై రుసుములు వసూలు చేసే అధికారం బ్యాంకులకు కల్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సహా కొన్ని డిజిటల్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించే అవకాశాన్ని కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007లో సవరణలు చేసే ఈ బిల్లు ద్వారా బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై రుసుములు వసూలు చేసే అవకాశం కల్పించనున్నారు.
బ్యాంకులకు ఛార్జీల అధికారం
లోక్సభ ఆమోదించిన సవరణ బిల్లు ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలు ఛార్జీలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వసూలు చేయకుండా ఉన్న నిబంధనలో మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
చర్చ లేకుండానే బిల్లుకు ఆమోదం
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నిర్వహిస్తున్న బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయ మార్గాన్ని కల్పించడమే ఈ మార్పుల ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. వినియోగదారులు, చిన్న వ్యాపారులపై పెద్ద భారం పడకుండా చిన్న మొత్తంలో రుసుములు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
లోక్సభలో ఈ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించారు. ప్రస్తుతం UPI వంటి డిజిటల్ చెల్లింపు విధానాలపై ఎలాంటి ఛార్జీలు లేవు. అయితే ప్రతిపాదిత చట్ట సవరణలతో కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే కొన్ని ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించే అవకాశం ఉంటుంది.
Also Read:
నన్ను ఎవరూ ఆపలేరు: రాహుల్ గాంధీ
క్యా బోల్తీ పబ్లిక్.. నిరుద్యోగం, విద్యా సంస్కరణలపై సీజేపీ దేశవ్యాప్త ప్రచారం..