విజయ్ క్యాబినెట్లో తెలుగు బిడ్డ కీర్తన
ABN , Publish Date - May 11 , 2026 | 05:42 AM
స్.కీర్తన.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తున్న పేరు. ఆదివారం సీఎంగా విజయ్తో పాటు ప్రమాణస్వీకారం చేసిన తొమ్మిది మంది మంత్రుల్లో ఆమె ఒక్కరే మహిళ!...
అమరావతి/చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): ఎస్.కీర్తన.. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తున్న పేరు. ఆదివారం సీఎంగా విజయ్తో పాటు ప్రమాణస్వీకారం చేసిన తొమ్మిది మంది మంత్రుల్లో ఆమె ఒక్కరే మహిళ! ప్రతిభ ఉంటే ఎక్కడైనా రాణిస్తారనే దానికి కీర్తన జీవితం ఒక ఉదాహరణ. తమిళనాడులోని శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ అభ్యర్థిగా గెలిచి, ఇప్పుడు 29 ఏళ్ల పిన్న వయసులోనే ఏకంగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా చోటు దక్కించుకున్న కీర్తన సంపత్.. ఆంధ్రా మూలాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. కీర్తన పూర్వీకులు ఆంధ్రా నుంచి తమిళనాడుకు వెళ్లి విరుదునగర్లో సెటిల్ అయ్యారు. గతంలో తెలుగుదేశంతో పాటు పలు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలకు ఎన్నికల ప్రచార సలహాదారుగా, వ్యూహకర్తగా పనిచేసిన ఆమె.. ఆ అనుభవంతో నేడు తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారు. టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్సన్ టీంలో కీర్తన హైదరాబాద్లోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నాలుగేళ్ల పాటు షోటైం కన్సల్టింగ్ (ఎస్టీసీ)గా పనిచేశారు. కీర్తన క్రియాశీల రాజకీయాల్లోకి రాకముందు.. షోటైమ్ కన్సల్టింగ్, ఐప్యాక్ సంస్థల్లో రాజకీయ సలహాదారు, డిజిటల్ ప్రచార వ్యూహకర్తగా పనిచేశారు. టీడీపీ, టీఎంసీ, డీఎంకే కోసం ఎన్నికల ప్రచారాల్లో కూడా పాలుపంచుకున్నారు. ఆమె స్టాలిన్, మమత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఎంఎస్సీ(స్టాటిస్టిక్స్)లో పట్టభద్రురాలైన కీర్తన తమిళం, తెలుగు, ఆంగ్లం, హిందీ సహా పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. ఆమె 1996లో విరుదునగర్లో జన్మించారు.
రాజకీయ పరిజ్ఞానం మెచ్చి..
సోషల్ మీడియాలో కీర్తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానం, ఇంటర్వ్యూ చేసే తీరు, ఎన్నికల వ్యూహంపై ఉన్న పరిజ్ఞానాన్ని మెచ్చి ఆమెకు విజయ్ శివకాశి సీటు కేటాయించారు. గత ఏడు దశాబ్దాల కాలంలో శివకాశి నుంచి గెలిచిన మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే కీర్తన కావడం గమనార్హం. టీడీపీ వ్యూహకర్తగా పనిచేస్తున్న కాలంలోనే ఆమెకు ఎన్నికల వ్యూహం, ఓటర్ల నాడి, ప్లానింగ్పై పనిచేసిన అనుభవం తమిళనాడు ఎన్నికల్లో కలిసొచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News