టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. అర్హతలేనివారికి నో ఎంట్రీ
ABN , Publish Date - Sep 08 , 2026 | 12:34 PM
దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల నియామకాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హత ప్రమాణాలు పాటించకుండా టీచర్లను నియమించడం లేదా సర్వీసులో కొనసాగించడం కుదరదని స్పష్టం చేసింది..
ఢిల్లీ, సెప్టెంబర్ 8: దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యావ్యవస్థలో నాణ్యతను కాపాడేందుకు అర్హత లేని వ్యక్తులను టీచర్లుగా నియమించకూడదని స్పష్టం చేసింది. RTE, NCTE, UGC నిబంధనల ప్రకారం నిర్దేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వారిని కొత్తగా నియమించడం మాత్రమే కాకుండా.. ఇప్పటికే సర్వీసులో ఉన్న వారిని కూడా కొనసాగించడానికి వీల్లేదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఉపాధ్యాయుల నియామకాల్లో విద్యార్థుల ప్రయోజనాలు, బోధనా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది.
ప్రభుత్వ సర్వీసుల్లోకి ఉపాధ్యాయులను విలీనం చేసే పేరుతో పారదర్శకమైన, పోటీతత్వ నియామక ప్రక్రియను పక్కన పెట్టడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి పారదర్శక నియామక ప్రక్రియ లేకుండా.. అర్హతలు లేని వ్యక్తులను ప్రభుత్వ సర్వీసుల్లోకి తీసుకోవడాన్ని అంగీకరించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. RTE, NCTE, UGC నిబంధనలకు అనుగుణంగా అర్హతలు ఉన్నవారినే ఉపాధ్యాయులుగా నియమించాలని పేర్కొంది. అర్హత ప్రమాణాలను పాటించకుండా నియామకాలు చేపడితే విద్యార్థుల విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో టీచర్ల నియామకాల్లో ఇకపై నిబంధనలు, పారదర్శకత, మెరిట్కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కాంగ్రెస్ ఎంపీల ఆగ్రహం
అమరావతిని మారుస్తామనడం అవివేకం
For More AP News And Telugu News