మైనర్లు, నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయండి.. సుప్రీం కోర్టు ఆదేశం
ABN , Publish Date - Jul 28 , 2026 | 12:10 PM
పరీక్ష పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లలోపు మైనర్లు, అలాగే ఎలాంటి నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
ఢిల్లీ, జులై 28: పరీక్ష పేపర్ లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ (మంగళవారం) కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్లలోపు మైనర్లు, అలాగే ఎలాంటి నేరచరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లకు సంబంధించి, వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం తన తాత్కాలిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ అంశంపై దేశవ్యాప్తంగా సాగిన నిరసనల సమయంలో, విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా, అత్యున్నత న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని గుర్తుచేసింది.
స్వతంత్ర విచారణ జరగాల్సిందే
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. 'నిర్దోషులపై అతిక్రమణలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ఊరుకోదు, తన పని తాను చేసుకుపోతుంది' అని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఘటనలపై 'స్వతంత్ర విచారణ' జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. 'బాధ్యులను తేల్చనప్పుడు, విచారణకు అర్థమే లేదు' అని CJI వ్యాఖ్యానించారు.
శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు తెలుపడం పౌరుల ప్రాధమిక హక్కు అని అత్యున్నత కోర్టు స్పష్టం చేసింది. నీట్ పరీక్షలో అక్రమాలపై న్యాయం కోరుతూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో, వారిపై బలాన్ని ప్రయోగించడం సరికాదని కోర్టు భావించింది.
పోలీసుల రక్షణపైనా ప్రశ్నలు
ఈ ఆందోళనల సమయంలో విద్యార్థులపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, గాయపడిన పోలీసుల రక్షణ, వారి భద్రతా పరికరాల గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కోర్టు పేర్కొంది. శాంతిభద్రతల నిర్వహణ అనేది ద్వితీయ ప్రాధాన్యం కాకూడదని స్పష్టం చేసింది.
ఏకీకృత ప్రొటోకాల్ అవసరం
దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో జరుగుతున్న నిరసనల సమయంలో శాంతిభద్రతల నిర్వహణకు, అల్లర్లను అదుపు చేయడానికి సంబంధించి ఒకే విధమైన (ఏకీకృత) ప్రొటోకాల్ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు వేర్వేరుగా ప్రవర్తించడం సరికాదని, నిర్దిష్ట నియమావళి ఉండాలని సూచించింది.
ఇవి కూడా చదవండి..
బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..