సుప్రీంకోర్టులో ఊహించని ఘటన.. న్యాయమూర్తులపై ఆగ్రహించిన పిటిషనర్..
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:45 PM
సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ న్యాయమూర్తులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో కోర్టు హాలులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఇవాళ (శుక్రవారం) అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ న్యాయమూర్తులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. దీంతో కోర్టు హాలులో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం నిందితుడు చేతిలో ఉన్న కేసు పత్రాల కట్టను న్యాయమూర్తుల డయాస్ వైపు విసిరేయడంతో భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పిటిషనర్ను బలవంతంగా కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన న్యాయమూర్తులు జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం కేసు విచారణ చేస్తున్న సమయంలో జరిగింది.
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నేడు విచారణ సందర్భంగా స్వయంగా హాజరై తన వాదనలు వినిపించే క్రమంలో అసాధారణంగా దూకుడుగా ప్రవర్తించాడు. వాదనలు ప్రారంభించిన వెంటనే 'లక్నో ఏసీపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నేను ఆదేశిస్తున్నా' అంటూ న్యాయమూర్తులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన జస్టిస్ కేవీ విశ్వనాథన్.. 'మీరు మమ్మల్ని ఆదేశిస్తున్నారా?' అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పిటిషనర్ 'నా తరఫున చెప్పాల్సిందంతా చెప్పాను. అన్నీ రికార్డులో ఉన్నాయి' అని పేర్కొన్నాడు.
అనంతరం ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై కేసు పత్రాలను గాల్లోకి విసిరేయడంతో పాటు, కోర్టు హాలులోనే న్యాయమూర్తులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పిటిషనర్ను అదుపులోకి తీసుకుని కోర్టు హాలు నుంచి బయటకు తరలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు కోర్టు హాలులో కలకలం రేగింది. అయినా న్యాయమూర్తులు ఏమాత్రం సహనం కోల్పోకుండా విచారణను కొనసాగించడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రశ్న రావణ్, ప్రకాశ్ రాజ్, జడ శ్రవణ్లు పెయిడ్ ఆర్టిస్ట్లు: జనసేన ఎమ్మెల్యే
నేడు ఒకరు ఆడించినట్టు ఆడే వ్యక్తిని కాదు: ఎంపీ ఈటల