సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం..
ABN , Publish Date - Aug 03 , 2026 | 04:47 PM
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్సభ ఇవాళ (సోమవారం) ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తితో కలిపి 34 నుంచి 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం, రామమందిర విరాళాల నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండటంతో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది. ఆర్డినెన్స్ జారీని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడా మూజువాణి ఓటుతో సభ తిరస్కరించింది.
సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026ను సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దాని గురించి వివరించారు. అనంతరం బిల్లుపై సభ్యులు మాట్లాడాలని సభాపతి ఓం బిర్లా కోరినప్పటికీ, విపక్షాల నినాదాలు కొనసాగడంతో బిల్లును ఓటింగ్కు పెట్టారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు-2026కు సభ ఆమోదం తెలిపింది. ఇటీవల జనన, మరణాల నమోదు చట్ట సవరణ బిల్లు కూడా లోక్సభలో చర్చ లేకుండానే ఆమోదం పొందింది. తాజా బిల్లు ఆమోదం అనంతరం లోక్సభను స్పీకర్ వాయిదా వేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అలాంటి భాగస్వామిపై క్రిమినల్ కేసులు..
టీమిండియా మాజీ కోచ్ దిలీప్ భావోద్వేగభరితమైన లేఖ