అజిత్ పవార్ విమాన ప్రమాదం రోజే 75 ఫైళ్ల క్లియరెన్స్పై వివాదం
ABN , Publish Date - Feb 18 , 2026 | 04:12 PM
అజిత్ పవార్ విమానప్రమాదానికి గురైన జనవరి 28న కీలకమైన అడ్మనిస్ట్రేటివ్ నిర్ణయం జరిగింది. మైనారిటీ స్కూళ్లకు సంబంధించిన 75కు పైగా ఫైళ్లను మహారాష్ట్ర మైనారిటీ శాఖ క్లియర్ చేసింది.
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) ఇటీవల విమాన ప్రమాదంలో మరణించడంపై ఆ పార్టీ నేతల్లో ఇప్పటికీ అనుమానాలు వ్యక్తవుతున్నాయి. విమాన ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఎన్సీపీ ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫఢ్నవిస్కు అందజేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కీలక విషయం వెలుగుచూసింది. అజిత్ పవార్ విమానప్రమాదానికి గురైన జనవరి 28న కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ నిర్ణయం జరిగింది. మైనారిటీ స్కూళ్లకు సంబంధించిన 75కు పైగా ఫైళ్లను మహారాష్ట్ర మైనారిటీ శాఖ క్లియర్ చేసింది. మైనారిటీ విద్యా సంస్థల గుర్తింపు, ఆమోదానికి సంబంధించిన ప్రపోజల్స్ కలిగిన ఫైళ్లు ఇందులో ఉండటం సంచలనమవుతోంది. ఈ పరిణామం రాజకీయ, అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్లో అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను ఒకే రోజులో క్లియర్ చేయడం వెనుక అవకతవకలు జరిగినట్టు విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
'ఇంత స్వల్ప వ్యవధిలో పెద్ద మొత్తంలో ఫైళ్లు క్లియర్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. సరైన విధివిధానాలు, స్క్రూటినీపై అనుమానాలున్నాయి' అని విపక్ష నేత ఒకరు అన్నారు. కాగా, ఈ వివాదంపై ప్రభుత్వం తక్షణ విచారణను చేపట్టింది. మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలంద్ షెనోయ్ను బదిలీ చేసింది. ప్రభుత్వ విచారణ తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
జాతీయ భద్రతకు రాహుల్ ప్రమాదకారి.. రిజిజు సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!