ఆస్పత్రికి వాంగ్చుక్ తరలింపు
ABN , Publish Date - Jul 19 , 2026 | 06:18 AM
నీట్ తదితర ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పలువురు విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 21 రోజులుగా...
వాంగ్చుక్ను బలవంతంగా తరలించిన ఢిల్లీ పోలీసులు
చికిత్సకు ఆయన నిరాకరణ
నా భర్త ఆరోగ్యం బాగానే ఉంది
20న ర్యాలీలో పాల్గొంటారు
వాంగ్చుక్ భార్య గీతాంజలి వెల్లడి
నిరవధిక దీక్ష ప్రారంభించిన దీప్కే
దీప్కేపై ఇంకు చల్లిన ఓ మహిళ
ఉల్లి ధరలే ప్రభుత్వాల్ని కూల్చాయ్
విద్యార్థుల నిరసన ఆ పని చేయలేదా?.. వాంగ్చుక్ వీడియో
న్యూఢిల్లీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నీట్ తదితర ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, పలువురు విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గత 21 రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను ఢిల్లీ పోలీసులు శనివారం బలవంతంగా సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయునప్పటికీ, ఆయన దీక్షను విరమించటానికి ససేమిరా అంటున్నారు. చికిత్సను తీసుకోవటానికి అంగీకరించటం లేదు. వాంగ్చుక్ పరిస్థితి బాగానేఉన్నా.. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, ఐవీ ఫ్లూయి డ్స్ ఎక్కించాలని వైద్యులు చెబుతున్నారని వాంగ్చుక్ సతీమణి గీతాంజలి ఆంగ్మో తెలిపారు. సఫ్దర్జంగ్ వైద్యుల తీరుపై తనకు నమ్మకం లేదని, తమకు విశ్వసనీయమైన మరో ఆస్పత్రికి తరలించటానికి అనుమతించాలని కోరారు. వాంగ్చుక్ ఆరోగ్యంగానే ఉన్నారని, సోమవారం జరిగే ర్యాలీలో పాల్గొంటారని.. ఆయన రాలేకపోతే తాను పాల్గొంటానని స్పష్టం చేశారు. మరోవైపు, ధర్మేం ద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఉద్యమాన్ని ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్యక్షుడు అభిజిత్ దీప్కే.. నిరాహారదీక్షను ప్రారంభించారు. సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే సందర్భంగా జంతర్మంతర్ నుంచి పార్లమెంటు వరకూ తాము తలపెట్టిన ర్యాలీని నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
అర్ధరాత్రి నుంచే పోలీసుల ప్రణాళిక..
సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించేందుకు ఢిల్లీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రణాళికను అమలులో పెట్టారు. రాత్రి 1.30 గంటల సమయంలో పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి న్యూఢిల్లీ జిల్లాలోని సీనియర్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆ అధికారులు మందిర్మార్గ్ పోలీస్ స్టేషన్లో సమావేశమై ఆపరేషన్ ఎలా నిర్వహించాలన్నదానిపై సమాలోచన జరిపారు. నిమిషంలోపే దీనిని ముగించాలని నిర్ణయించారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో అభిజిత్ దీప్కే కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లిన సమయాన్ని చూసి, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చారు. కొందరు చుట్టూ తెల్లటి తెరలను పట్టుకోగా, మరికొందరు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్లోకి తీసుకెళ్లారు. చుట్టూ ఉన్న ఆందోళకారులు ఎవ రూ ఫొటోలు, వీడియోలు తీసి తరలింపును రికార్డు చేయకుండా తెల్లటి తెరలను అడ్డుగా పెట్టారు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో నిరసనకారులు తేరుకొని అడ్డుకోవాలని ప్రయత్నించినా పోలీసులు వారిని నెట్టేశారు. ఈ క్రమంలో కొందరికి గా యాలయ్యాయి. తనపై పోలీసులు దాడి చేశారని దీప్కే తెలిపారు. వాంగ్చుక్తోపాటు ఆమరణదీక్షలో ఉన్న విద్యార్థి నేతలు నేహా, అమీన్, మనీశ్లను తరలించకుండా..
నిరసనకారులు వారి చుట్టూ నిలబడటంతో వారిని పోలీసు లు తీసుకెళ్లలేదు. మొత్తంగా 10 నిమిషాల వ్యవధిలో ఇదంతా జరిగిపోయింది. వాంగ్చుక్ ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్య లు తీసుకోవాలంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఆయనను ఆస్పత్రికి తరలించామని ఢిల్లీ పోలీసు విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
అభిజిత్ దీప్కేపై ఇంకుతో దాడి
వాంగ్చుక్ను పోలీసులు తరలించటంతో జంతర్మంతర్ వద్ద ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. అభిజిత్ దీప్కే నిరవధిక దీక్షను ప్రారంభించారు. మధ్యా హ్నం సమయంలో దీక్ష శిబిరం వద్ద దీప్కే మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ అకస్మాత్తుగా ఆ యనపై ఇంకు చల్లింది. నిరసనకారులు, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
ఉల్లిగడ్డల ధరలు.. ప్రభుత్వాల్ని కూల్చాయి
పోలీసులు తరలించటానికి ముందురోజైన శుక్రవారం రాత్రి వాంగ్చుక్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘ఆమరణ దీక్షలో 20 రోజులు గడిచాయి. నా శరీరంలో 20ు బరువు కోల్పోయాను. తొలుత కొవ్వులు, ఆ తర్వాత కండరాలు పోయాయి. ఇప్పుడిక శరీరభాగాలు పని చేయటం మానేస్తాయి. చివరికి మెదడు కూడా. ఇంకా ఆ పరిస్థితి రాలేదు. నా మెదడు చురుగ్గా పని చేస్తోంది. ఈ సందర్భంగా నా దేశ ప్రజల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. మీరు ఉల్లిగడ్డల్ని ఎక్కువ ప్రేమిస్తారా? మీ పిల్లల్నా? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే.. ఉల్లిగడ్డల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రజల నిరసనతో 1980లో కేంద్రప్రభుత్వం కూలిపోయింది. 1988లో ఢిల్లీ ప్రభుత్వం, రాజస్థాన్ ప్రభుత్వాలు కూడా ఈ కారణంతోనే కూలాయి. కానీ, ప్రస్తుతం ప్రశ్నపత్రాల లీకేజీలతో ఈ ఏడాది ఇప్పటికే 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి, దీనికి ఎవరినీ జవాబుదారీ చేయవద్దా? విద్యామంత్రి రాజీనామా చేయవద్దా? అందుకే సోమవారం జరిగే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొందాం. నేను కూడా వస్తా. నేను ఒక ఒంటరి మనిషిని. మీరే బలం. ఈ బలమే ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని ప్రభుత్వాలను దించివేసింది’ అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
దేశ అంతరిక్ష కలలకు చిరునామాగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి
గంజాయి పండిస్తున్న సాధువు.. అరెస్ట్ చేసిన పోలీసులు