ఆకాశంలోకి ఆశల రాకెట్!
ABN , Publish Date - Jul 18 , 2026 | 06:19 AM
తక్కువ ఖర్చుతోనే ప్రపంచ స్థాయి సాంకేతికతను సాధించిన ఇస్రో... దేశానికి ఎన్నో చారిత్రక విజయాలు అందించింది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ...
నేడే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం
ఉదయం 11.30 గంటలకు నింగిలోకి..
సూళ్లూరుపేట, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తక్కువ ఖర్చుతోనే ప్రపంచ స్థాయి సాంకేతికతను సాధించిన ఇస్రో... దేశానికి ఎన్నో చారిత్రక విజయాలు అందించింది. ఇప్పుడు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి ‘విక్రమ్-1’ నాంది పలకనుంది. ఇస్రో రాకెట్లపై ఆధారపడకుండా.. కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టగల తొలి ప్రైవే టు రాకెట్ ఇదే. భారత్లోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఈ మొట్టమొదటి ఆర్బిటల్-క్లాస్ రాకెట్ను హైదరాబాద్కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ తయారు చేసింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్లో ‘మిషన్ ఆగమన్’ పేరిట శనివారం చేపట్టనున్న విక్రమ్-1 ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధనా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. షార్లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రయోగం చేపట్టనున్నట్టు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ప్రకటించింది. ఈ రాకెట్ ద్వారా నాలుగు చిన్న ఉపగ్రహాలు, మరో రెండు చిన్న పేలోడ్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్నారు. 5.30 గంటల కౌంట్డౌన్ పూర్తయిన తర్వాత విక్రమ్-1 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగరనుంది.
ఇవి కూడా చదవండి
తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు