6 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ పూర్తి.. గుజరాత్లో 68 లక్షల ఓటర్ల తొలగింపు
ABN , Publish Date - Feb 21 , 2026 | 08:16 PM
ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పూర్తయింది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది.
న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయింది. ఆ వివరాలను ఎన్నికల కమిషన్ శనివారంనాడు విడుదల చేసింది. రివిజన్ ప్రక్రియలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనర్హత కలిగిన ఓటర్లను జాబితా నుంచి తొలగించింది.
తాజాగా విడుదల చేసిన జాబితాలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కంటే గుజరాత్లో అత్యధికంగా ఓటర్ల తొలగింపు చోటుచేసుకుంది. రికార్డు స్థాయిలో 68 లక్షల 12 వేల 711 మందిని జాబితా నుంచి తొలగించింది. ఎస్ఐర్ ప్రక్రియకు ముందు 5,08,43,436 మంది ఓటర్లు ఉండగా అది ప్రస్తుతం 4,40,30,725కు తగ్గింది. మధ్యప్రదేశ్లో 34,25,078 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. దీంతో ఓటర్ల సంఖ్య 5,74,06,143 నుంచి 5,39,81,065కు తగ్గింది.
ఇతర రాష్ట్రాల్లోనూ గణనీయంగా ఓటర్ల జాబితాలో సవరణలు చేటుచేసుకున్నాయి. రాజస్థాన్లో ఓటర్ల సంఖ్య 5,46,56,215 నుంచి 5,15,19,929 మందికి తగ్గింది. ఛత్తీస్గఢ్లో 2,12,30,737 నుంచి 1,87,30,914కు, కేరళలో 2,78,50,855 నుంచి 2,69,53,644కు తగ్గింది. గోవాలో ఓటర్ల సంఖ్య 11,85,034 నుంచి 10,57,566కు తగ్గింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 52,364 మందిని జాబితా నుంచి తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 3,10,404 నుంచి 2,58,040కి తగ్గింది. పుదుచ్చేరిలో ఓటర్ల సంఖ్య 10,21,578 నుంచి 9,44,211 మందికి, లక్షద్వీప్లో 57,813 నుంచి 57,607కు తగ్గింది. ఓటర్ల మరణం, శాశ్వతంగా నివాసస్థలాల మార్పు, పలుచోట్ల రిజిస్టర్ చేయించుకోవడం, ఇతర అనర్హత కారణాల వల్ల ఓటర్ల తొలగింపు జరిగిందని, కొత్త ఓటర్లకు జాబితాలో చోటు కల్పించామని ఈసీ తెలిపింది. ఎన్నికల జాబితా అప్డేట్ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన పౌరులు అప్లయ్ చేసుకోవడం, ఎంట్రీల కరెక్షన్ వంటివి చేసుకోవచ్చని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
పిల్లలపై లైంగిక వేధింపుల కేసు.. అవిముక్తేశ్వరానంద స్వామిపై ఎఫ్ఐఆర్
రాళ్లు రువ్వుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత